న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 6.30 గంటలకు ప్రధాని ప్రసంగం ప్రారంభం కానుంది. నరేంద్రమోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ స్థాయిలో యోగా డే జరుపుకుంటున్నారు.
అయితే, ప్రతి యోగా డేకు ఒక నినాదాన్ని నిర్ణయించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది యోగా ఫర్ వెల్నెస్ అనే నినాదాన్ని యోగా డే నినాదంగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘రేపు మనం 7వ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈసారి యోగా డే నినాదం యోగా ఫర్ వెల్నెస్. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధన చేయాలనేది ఈ నినాదం ఉద్దేశం’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
రేపు అంతర్జాతీయ యోగా డేను జరుపుకోనున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూనే యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఉదయం 6.30 ప్రధాని మోదీ ప్రసంగంతో కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించింది.