హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం వెల్లివిరిస్తోంది. అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా.. ‘‘వానలు వాపస్ రావాలె’’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పెరుగుతున్న జనాభా, అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వర్షాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ సమతుల్యం దెబ్బతింటున్నది. మొత్తమ్మీద మానవ జీవితమే అల్లకల్లోలం అవుతున్నది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నాలకు తగ్గ ఫలితం ఇప్పుడు లభిస్తోంది. తాజాగా కురిసిన వర్షాలకు ఎండిపోయిన మాను మళ్లీ చిగురించింది. భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఎల్బీనగర్ డివిజన్లోని నర్సరీలో కనిపించిందీ దృశ్యం.