తిరుపతి, మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం బదులు భోగితేరుపై శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిదంరాజస్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం తేరును దర్శించడం వలన కలుగుతుంది. అనంతరం ఉదయం 9 నుంచి10.30 గంటల వరకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు స్వామివారు అశ్వవాహనంపై కటాక్షించనున్నారు.