27 సాయంత్రం వరకే ప్రచారం
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి
వరంగల్, ఏప్రిల్ 24 : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ తేదీకి 72 గంటల ముందే అభ్యర్థులు ప్రచారం ముగించాలన్నారు. 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందన్నారు. దీన్ని అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు మాస్కు ఉంటేనే అనుమతించాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం, బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్స్ల సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సీసీ కెమెరా, వెబ్ కాస్టింగ్, పోలీస్ బందోబస్తు, వీడియో చిత్రీకరణల మధ్య పోలింగ్ నిర్వహించాలన్నారు. ఓటరును ప్రలోభాలు పెట్టే వారిపై నిఘా పెట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించి, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సంఘ వ్యతిరేకులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేయాలన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. కరోనా నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మాస్కులు, గ్లౌజ్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 80 సంవత్సరాల వయస్సు, కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఫొటో ఓటర్ల స్లిప్పులను 27లోగా పంపిణీ చేస్తామన్నారు. 127 సమస్యాత్మక, 203 సున్నితమైనవిగా, 159 హైపర్ క్రిటికల్ కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. వీసీలో సీపీ తరుణ్ జోషి, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి, డీసీపీ పుష్ప, బల్దియా అదనపు కమిషన్ నాగేశ్వర్, డీఎస్పీ జనార్దన్ పాల్గొన్నారు.