న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంలో సామాన్య ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నప్పటికీ, కోటీశ్వరుల ఆస్తులు మరింత పెరుగుతున్నాయి. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 17 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చారు (ఒక బిలియన్ అంటే వందకోట్లు). ఈ మేరకు ప్రఖ్యాత వార్త పత్రిక ఫోర్బ్స్ ‘వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2021’ పేరిట ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా విజృంభించిన 2020-21 సంవత్సరంలో ఏకంగా 493 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చినట్టు నివేదిక వెల్లడించింది. 2015లో అత్యధికంగా 290 మంది బిలియనీర్లు ఆ ఏడాది కొత్తగా జాబితాలో చేరారు. ఇప్పటివరకూ ఇదే రికార్డు. దీనిని తాజా రికార్డు బద్దలుకొట్టింది. ప్రస్తుతం కొత్తగా జాబితాలో చేరిన 493 మంది బిలియనీర్ల ఆస్తులు 200 కోట్ల డాలర్లని ఫోర్బ్స్ వెల్లడించింది. బిలియనీర్ల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్న వారి సంపద మొత్తం కలిపితే 1.15 లక్షల కోట్ల డాలర్లని నివేదిక వివరించింది.