లక్నో: అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరిలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా కైరానా పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగినప్పుడు ఫ్యాక్టరీలో 10 మంది కూలీలు పనిచేస్తున్నారని, నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఇంకో ఇద్దరి ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారని షామ్లీ జిల్లా కలెక్టర్ జస్జీత్ కౌర్ తెలిపారు.
మృతులు పప్పీ, సల్మాన్, ఫయీముద్దీన్, రుమాన్గా పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో గతంలో పచ్చళ్లు తయారు చేసేవారని, కరోనా మహమ్మారి విజృంభణతో ఆ కంపెనీ మూతపడిందని, ఇప్పుడు అదే కంపెనీలో అక్రమంగా పటాకులు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారు.