లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను తన వాహనంతో తొక్కించి హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమిత్ జైస్వాల్(బీజేపీ నాయకుడు), శిశుపాల్, నందన్ సింగ్ బిస్త్, సత్య ప్రకాశ్ త్రిపాఠిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యప్రకాశ్ త్రిపాఠి నుంచి లైసెన్స్డ్ రివాల్వర్, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 3న లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు పక్కన నిరసన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా వాహనం దూసుకెళ్లింది. రైతులను వాహనంతో తొక్కించిన ఘటనతోపాటు అనంతరం జరిగిన అల్లర్లలో మొత్తం 8 మంది మరణించారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ కేసులో అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.