న్యూఢిల్లీ, జూలై 12: ప్రజలు కొవిడ్ నిబంధనలను గాలికొదిలేసి పర్యాటక ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు కరోనా మహమ్మారి మళ్లీ ఉద్ధృతంగా వ్యాపించడానికి, మూడో వేవ్కు కారణం అవుతాయని హెచ్చరించింది. ప్రజలు, ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం తగదని, ప్రజలు గుంపులుగా తిరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ‘పర్యాటక రంగం, పండుగల నిర్వహణ అవసరమే. కానీ ఇంకొన్ని నెలలు వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలి’ అని ఐఎంఏ సూచించింది. ఒడిశాలో పూరీ జగన్నాథుని రథయాత్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ల్లో కన్వర్ యాత్ర నిర్వహణపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఐఎంఏ ఈ సూచనలు చేసింది.