వాషింగ్టన్: వైద్యశాస్త్రం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ, వ్యాక్సిన్లను ఇచ్చే ప్రక్రియలో మాత్రం గత 50 ఏండ్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. వ్యాక్సిన్ పౌడర్ను లేదా లిక్విడ్ను ఫ్రిజ్లో నిల్వ ఉంచడం, సూదితో శరీరానికి బాధ కలిగించేలా ఇంజక్షన్ చేయడం ఇప్పటికీ కొనసాగుతున్నది. అయితే, దీనికి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు చక్కని పరిష్కారాన్ని కనిపెట్టారు. సూది అవసరం లేకుండానే వ్యాక్సిన్ ఇచ్చేందుకు త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో ‘3డీ-వ్యాక్సిన్ ముద్రణ సూదిపట్టీ’ (3డీ ప్రింటెడ్ వ్యాక్సిన్ నీడిల్ ప్యాచ్)ని అభివృద్ధి చేశారు.
ఎలా తయారు చేశారు?
పాలీమర్ పట్టీపై త్రీడీ ముద్రిత సూక్ష్మ సూదులను (వెంట్రుకల కంటే ఎంతో సన్నగా ఉంటాయి) అమర్చడం ద్వారా ‘3డీ-వ్యాక్సిన్ ముద్రణ సూదిపట్టీ’ని సిద్ధం చేశారు. సూక్ష్మ సూదుల్లో టీకాను ముందుగానే నింపుతారు. వ్యాక్సిన్పై ఉష్ణోగ్రతలు ప్రభావం చూపకుండా పొరలాంటి నిర్మాణంతో ప్యాక్ చేస్తారు.
తర్వాత పట్టీ ఏమవుతుంది?
పట్టీపై టీకా పూత ఉండటంవల్ల.. చర్మంపై పట్టీని అతికించిన కొద్దిసమయానికి సూదులు చర్మంలో కరిగిపోతాయి. అనంతరం పట్టీ దానికదే ఊడివస్తుంది.
ఎన్నో లాభాలు
నొప్పి కలగకుండానే ఈ టీకాను ఎవరికివారు సొంతగా వేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. దీనికోసం వ్యాక్సిన్ కేంద్రాలు, వైద్య సిబ్బంది అవసరంలేదన్నారు. ఎటువంటి ఉష్ణోగ్రతల వద్దనైనా ఈ వ్యాక్సిన్ను నిల్వ చేయవచ్చన్నారు. దీంతో కోల్డ్స్టోరేజీ సైప్లె వ్యవస్థ అవసరం ఉండదన్నారు.
ఎలా పని చేస్తుంది?
చర్మంలో రోగ నిరోధక కణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. చర్మానికి ఈ పట్టీని అతికించడం ద్వారా వ్యాక్సిన్ ద్రావణం నేరుగా లోపలికి వెళ్లి.. మంచి ఫలితాలను రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇంజెక్షన్ ద్వారా చేతి కండరంలోకి నేరుగా చేరవేసిన టీకా కంటే ఈ పట్టీ 10 రెట్లు సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన టీ-కణాల స్పందనను 50 రెట్లు ఎక్కువగా పెంచుతుందని పేర్కొన్నారు. కొవిడ్-19తో పాటు ఫ్లూ తదితర టీకాలు ఇవ్వడానికి అనుగుణంగా ఈ సూక్ష్మసూదుల్లో మార్పులు చేపట్టవచ్చని వెల్లడించారు.