మహోబా: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కత్తితో పొడిచి చంపడమేగాక, అదే కత్తితో తాను కూడా పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అడ్డుకోబోయిన తన సోదరిని కూడా కత్తితో గాయపర్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజానగర్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బిజానగర్కు చెందిన సంతోష్ రఖ్వార్ (35), సరస్వతి (32) ఇద్దరూ భార్యాభర్తలు. అయితే గత కొంత కాలంగా సంతోష్ రఖ్వార్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం సంతోష్ రఖ్వార్ తన భార్యను కత్తితో పొడిచాడు. అతని సోదరి ఆర్తి (17) అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా గాయపర్చాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కత్తి గాయాలు అయిన సంతోష్ రఖ్వార్ సోదరి ఆర్తి కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.