జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఆమోద ముద్ర
అంచనా వ్యయం రూ.11.33 కోట్లు
ఖర్చులు తగ్గించుకుని ఆదాయం
పెంచే మార్గాలు చూడాలన్న సభ్యులు
జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 31 : జిల్లా కేంద్రం గా రూపాంతరం చెందిన జనగామ మున్సిపల్కు సకల హంగులు సమకూర్చే దిశగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.14.79 కోట్లతో రూపకల్పన చేసిన అంచనా బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. సొంత మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోకుండా గ్రాంట్లపై ఆధారపడి అంచనా బడ్జెట్ను అంకెల గారడితో రూపొందించారని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జోక్యం చేసుకుంటూ జనగామకు జిల్లా కేంద్రం హంగులు సమకూర్చేలా చేపడుతున్న చర్యలను వివరించి ప్రతిపక్ష సభ్యులను మెప్పించడంతో బడ్జెట్కు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. 2020-21 సంవత్సరానికి సవరించి ప్రతిపాదనలు, 2021-22 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2019-20 మిగులు బడ్జెట్ సహా 2021 సవరణ సాధారణ ఆదాయం ముగింపు నిల్వ కలుపుకొని ప్రస్తుత బడ్జెను సవరించారు. జనగామకు జిల్లా కేంద్రం రూపురేఖలు తెచ్చేలా పట్టణ సుందరీకరణ, మురికివాడల అభివృద్ధి, ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు, 10 శాతం గ్రీన్ బడ్జెట్ వంటి వాటితో మొత్తం రూ.14 కోట్ల 79 లక్షల 51 వేలతో బడ్జెట్ను రూపొందించగా ఖర్చులు పోగా రూ.3.45 కోట్ల మిగులుతుందని అంచనా వేశారు.
అంచనా బడ్జెట్ ఇదే..
2020 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.4.19 కోట్లు ఉండగా, 2020-21 సాధారణ ఆదాయం రూ.8.44 కోట్లు కలిపితే రూ.12.64 కోట్ల బడ్జెట్కు ఆమోదం లభించింది. ఇందులో రూ.8.76 కోట్లు ఖర్చు చేయగా రూ.3.88 కోట్లు మిగులు బడ్జెట్గా చూపించారు. 2021-22 వార్షిక బడ్జెట్లో అంచనా ఆదాయాన్ని రూ.10.91 కోట్లుగా లెక్కకట్టినా 2020-21 మిగులు బడ్జెట్ రూ.3.88 కోట్లు కలిపి రూ.14.79 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కోరిన సవరణలతో ఆమోదించారు. ఇందులో అంచనా సాధారణ వ్యయం రూ.11.33 కోట్లు ఖర్చు చేయనుండగా రూ.3.45 కోట్లు మిగులు ఉంటుందని బడ్జెట్ నివేదికలో పేర్కొన్నారు.
అదాయ వ్యయాలు
15వ ఆర్థిక సంఘం నిధులు సహా నాన్ప్లాన్, ప్లాన్, ఇంతర గ్రాంట్లు (ఎస్ఎఫ్సీ, ఎస్ఎంసీ) వంటి మార్గాల ద్వారా గ్రాంటు రూపేణా ఆదాయ, వ్యయం రూ.24.42 కోట్లుగా అంచనా వేయగా, గత ఏడాది రూ.14.81 కోట్లు అంచనా బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ ఈ సారి రూ.9.61 కోట్లు అదనంగా ప్రతిపాదించారు.
జనగామకు జిల్లా కేంద్రం ఆకృతి : ముత్తిరెడ్డి
జనగామ పట్టణానికి జిల్లా కేంద్రం ఆకృతి వచ్చేలా సకల హంగులు సమకూర్చేందుకు ఉద్దేశించిన అభివృద్ధి ప్రతిపాదనలకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, అందరి సహకారంతో కొద్ది నెలల్లో మున్సిపల్ రూపురేఖలు మారిపోతాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి చెప్పారు. కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లడుతూ జిల్లా కేంద్రానికి అవసరమైన మరిన్ని హంగులు సమకూర్చుకోవడం సహా మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆన్వేషించుకుంటే సొంత ఆదాయంతో అభివృద్ధికి బాటలు పడుతుందన్నారు. జనగామకు తలమానికంగా సువిశాలమైన కలెక్టరేట్ భవనం నిర్మించుకోవడం గర్వకారణమన్నారు. ఓ వైపు హైవే బైపాస్కు అనుసంధానంగా మరోవైపు యశ్వంతాపూర్-శామీర్పేట కొత్త బైపాస్ కోసం రూ.40 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామని ముత్తిరెడ్డి చెప్పారు. వాటికి ఢిల్లీ నుంచి అనుమతులు వస్తే శామీర్పేట-పెంబర్తి బైపాస్ జనగామ హైవే వరకు రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణానికి మణిహారంగా రింగ్రోడ్డు రూపుదిద్దుకుంటుందన్నారు. తద్వారా బైపాస్ చుట్టూ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం రూ.100 కోట్లతో ప్రతిపాదనలను జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ద్వారా ప్రభుత్వానికి నివేదించామని ముత్తిరెడ్డి తెలిపారు. పెంబర్తి బైపాస్ నుంచి కల్లెం ఆర్చి వరకు, పెంబర్తి నుంచి పాల కేంద్రం-యశ్వంతాపూర్ వరకు, నెల్లుట్ల బైపాస్ నుంచి జనగామ చౌరస్తా వరకు ఆరులైన్ల రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ప్రభుత్వ కొత్త బడ్జెట్లో మున్సిపల్, ఆర్అండ్బీ మంత్రిత్వ శాఖల నుంచి రూ.86 కోట్లు, మోడల్ మార్కెట్ కోసం అదనంగా రూ.1.50 కోట్ల ప్రతిపాదనలతో జిల్లా కేంద్రానికి అన్ని హంగులకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రం అభివృద్ధిలో వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
బడ్జెట్లో ఖర్చు ఇలా..
జనగామ మున్సిపల్ అంచనా బడ్జెట్లో రూ.11.13 కోట్లు ఖర్చుగా చూపారు. ఇందులో వేతనాల కోసం రూ.3.20 కోట్లు, ప్రజారోగ్యం (పారిశుధ్య విభాగం) కోసం రూ.1.15 కోట్లు, కరెంటు బిల్లుల చెల్లింపునకు రూ.1.93 కోట్లు, రుణాల చెల్లింపులకు రూ.60 లక్షలు, గ్రీన్ బడ్జెట్ కోసం 10 శాతం అంటే రూ.1.50 కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ఖర్చులకు రూ.1.11 కోట్లు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ కోసం రూ.71.30 లక్షలు పట్టణ ప్రణాళిక విభాగం కోసం రూ.14.50 లక్షలు, ప్రజా అవసరాలు, వార్డుల్లో వివిధ పనులు, అవసరాల కోసం రూ.98.07 లక్షలుగా పేర్కొన్నారు. గత ఏడాది రూ.4.51 కోట్లు ఉన్న ఆస్తిపన్ను ఈసారి బడ్జెట్లో రూ.3 లక్షల తక్కువగా అంటే రూ.4.48 లక్షలకు కుదించారు. ఆస్తిపన్నుపై వడ్డీమాఫీ ప్రకటించడం ఇందుకు కారణంగా కాగా, స్టాంప్డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై కొంత పెంచి 2020-21లో రూ.కోటి ఉంటే ఈసారి రూ.1.75 కోట్లకు పెంచారు. మున్సిపల్ మడిగలు(దుకాణాలు, ఐటీఎంఎస్టీ, షాపింగ్ కాంప్లెక్స్ పద్దులను మునుపటి కంటే రూ.9లక్షలు అందనంగా పెంచారు. ధ్రువీకరణ పత్రాల ఫీజు వసూళ్లను రూ.50 వేలకు పెంచగా అన్ని పద్దులకు ఆమోదం లభించింది. కౌన్సిల్ బడ్జెట్ అంచనా పద్దులను కమిషనర్ నర్సింహ చదివి వినిపించగా డీఈ రవీంథ్రనాథ్, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ తాళ్ల సురేశ్రెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ పాండు, బీజేపీ ఫ్లోర్లీడర్ బొట్ల శ్రీనివాస్, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడారు.