భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. ఇండోర్ సిటీలోని మహారాజా యశ్వంత్ రావు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్తో 20 రోజుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 13వ తేదీన బ్లాక్ ఫంగస్తో ఓ రోగి చేరగా, ఇప్పుడు ఆ సంఖ్య 439కి చేరింది. ఈ వ్యాధి నుంచి 84 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న రోగులకు గత 20 రోజుల నుంచి 200 సర్జరీలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం 323 మంది రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో 14 మంది బ్లాక్ ఫంగస్తో పాటు కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో 93 శాతం మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు నివేదికలు చెబుతున్నాయి.