సాగు భరోసా.. ‘దేవాదుల’
59గేట్లతో చకచకా సమ్మక్క బరాజ్ పూర్తి
ఈ వానకాలం నుంచే వినియోగంలోకి!
వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రాజెక్టును అంకితం చేసిన సీఎం కేసీఆర్
మొత్తం 14లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
240 మెగావాట్ల కరంటు ఉత్పత్తి సామర్థ్యం
వరంగల్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే ఆశయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముద్దాడింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు పచ్చబడగా, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో వరంగల్కు ‘దేవాదుల’ వరంలా మారబోతున్నది. దాదాపు 14లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై తుపాకుల గూడెం వద్ద చేపట్టిన ‘సమక్క బరాజ్’ పనులు 99శాతం పూర్తయ్యాయి. ఈ నెల ఆఖరులోగా పనులు మొత్తం పూర్తి చేసి ఈ వానకాలం నుంచే వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం, ప్రాజెక్టును వరంగల్ పాత జిల్లాకు అంకితం చేస్తామని ప్రకటించడంపై ఉమ్మడి జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం బరాజ్ హెడ్ రెగ్యులేటరీ తుదిదశ పనులు కొనసాగుతున్నాయి. 1143 మీటర్ల పొడవుతో ఉండే ఈ బరాజ్లో 59 రేడియల్ గేట్ల బిగింపు పూర్తయింది. మట్టి పని మొత్తం కంప్లీట్ కాగా, ప్రాజెక్టు నిర్మాణం కోసం 22.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన 11.52 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల్లో 11.42 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.1708 కోట్లతో పనులు జరిగాయి. నడక బ్రిడ్జి నిర్మాణం సైతం పూర్తయింది.
6.94టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క బజార్
దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం తో సీఎం కేసీఆర్ సమ్మక్క బరాజ్ నిర్మాణం చేపట్టారు. 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. గోదావరిపై తుపాకులగూడెం వద్ద కడుతున్న బరాజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాగా, 240 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేపట్టేలా దీనిని కడుతున్నారు. తుపాకులగూడెం పైన గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సమ్మక్క బరాజ్ నిర్మాణం పూర్తయితే దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ఉండే పాత వరంగల్ జిల్లా, సిద్ధిపేట, సూర్యాపేట జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఎస్సారెస్పీ పరిధిలోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకుంటుంది. ఇక ఏటా రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుంది.
వరంగల్ మహానగరంతోపాటు ఎన్నో గ్రామాలకు తాగునీరు సైతం అందుతుంది. ప్రస్తుత దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం 71 మీటర్లు ఉన్నప్పుడే మో టర్లు నీటిని ఎత్తిపోస్తాయి. వానలు బాగా పడే రోజుల్లోనే ఈ మేరకు నీటి మట్టం ఉంటుంది. వానకాలంలో గోదావరి నదిలో వరద ఉన్నప్పుడే మోటర్లు నడుస్తాయి. నీరు రిజర్వాయర్లకు అక్కడి నుంచి పొలాలకు చేరుతుంది. 71 మీటర్ల మేర నీటి మట్టం ఏడాదిలో గరిష్ఠంగా మూడు నెలలే ఉంటుంది. ఆ రోజుల్లోనే మోటర్లు నడుస్తాయి. వానలు తక్కువ ఉన్నా, గోదావరిలోకి వరద లేకున్నా నీటి ఎత్తిపోతలు కొనసాగవు. చాలాసార్లు వానకాలం పంటలకు సైతం నీటి పారుదల ఉండదు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చి ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీళ్లిచ్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద బరాజ్ను నిర్మించాలని నిర్ణయించారు. దేవాదుల పంప్హౌస్ ఉన్న ప్రదేశం నుంచి ఐదు కిలో మీటర్ల దిగువన ఈ బరాజ్ను నిర్మించారు. 83 మీటర్ల మేరకు నీటిని నిల్వ చేసేలా 92 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇక ఏడాది పొడవునా మోటర్లు నడిచేలా 71 మీటర్ల వరకు దేవాదుల పంప్హౌస్దాకా నీటి నిల్వ ఉంటుంది. దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందుతుంది.