హైదరాబాద్ : రాష్ట్రంలోని వలస కార్మికుల డేటాను పది రోజుల్లో సేకరించాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్రంలోని వలస కార్మికుల సంక్షేమంపై సీఎస్ సోమేశ్ కుమార్, కార్మికశాఖ అధికారులతో మంత్రి శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వలస కార్మికులకు రేషన్ కార్డులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రయోజనాలను అందించడానికిగాను ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. ఫార్మాస్యూటికల్, టెక్స్ టైల్స్, రైస్ మిల్స్, కన్ స్ట్రక్షన్ వంటి అన్ని పరిశ్రమల నుండి డేటాను సేకరించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమాల అమలుకు నోడల్ అధికారిని నియమించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కార్మికశాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.