లక్నో: ముగ్గురు వృద్ధ మహిళలకు కరోనా టీకా బదులు కుక్క కరిచినప్పుడు ఇచ్చే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశారు. దీంతో వారు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. ఉత్తర ప్రదేశ్లోని షామ్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 70 ఏండ్ల సరోజ్, 72 ఏండ్ల అనార్కలి, 60 ఏండ్ల సత్యవతి అనే ముగ్గురు మహిళలు గురువారం కరోనా టీకా వేయించుకునేందుకు షామ్లిలోని ప్రజా ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అయితే వారికి కరోనా టీకాలకు బదులు యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.
వృద్ధ మహిళలు పొరపాటున కరోనా టీకా వేసే తొలి అంతస్తుకు బదులు అవుట్ పేషెంట్ విభాగానికి వెళ్లారని జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ తెలిపారు. దీంతో అక్కడున్న ఒక ఫార్మసిస్ట్ పనిమీద బయటకు వెళ్తూ వీరిని చూడాలని జన ఔషధ కేంద్రానికి చెందిన వ్యక్తిని పురామాయించినట్లు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి వారిని ఏమీ అడగకుండానే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడని వివరించారు. సంబంధిత ఫార్మసిస్ట్ను సస్పెండ్ చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ను ఆదేశించినట్లు వెల్లడించారు.