హిమాయత్నగర్, మార్చి 30: వృద్ధురాలు అనుమానాస్పద మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో నివాసం ఉండే జూలియట్ ఆంథోని (71) వృద్ధురాలి మృతి వ్యవహారంలో వరుసకు తమ్ముడయ్యే యువకుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం రాత్రి నారాయణగూడలోని పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేశ్కుమార్, డీఐ రవికుమార్, అడ్మిన్ ఎస్సై కరుణాకర్రెడ్డి మాట్లాడారు. ఫిబ్రవరి 12న అర్ధరాత్రి వృద్ధురాలు జూలియట్ ఆంథోని ఒంటిపై కిరోసిన్ పోసి కాల్చి చంపారని, తమకు ప్రాథమికంగా లభించిన ఆధారాలతో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యగా కేసు నమోదు చేశామన్నారు.
వరసకు తమ్ముడయ్యే జోసెఫ్ రిచర్డ్(25) ఆమె బ్యాంకు ఖాతా వ్యవహారాలు చూసేవాడు. ఆంథోనికి తెలియకుండా రూ.5లక్షల వరకు కాజేశాడు. తన బ్యాంకు ఖాతాలో నుంచి రూ.5లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారంటూ ఆమె (జనవరి 30న) సీసీఎస్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డబ్బులు తానే కాజేసినట్లు బయటకు తెలిసే అవకాశముందని భావించి ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. ఫిబ్రవరి 12న అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి ఆమెతో వాగ్వివాదం పెట్టుకుని సీసీఎస్లో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఆమెను బెదరించాడు. ఆమె నిరాకరించడంతో గొంతు పట్టుకుని బలంగా నొక్కడంతో అపస్మారక స్థితిలో పడిపోయింది.
ఇంట్లో ఉన్న కిరోసిన్ను ఆమెపై చల్లి నిప్పంటించి పారిపోయాడు. ఈ తతంగాన్ని ఇతరులు గుర్తించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టాడు. జోసెఫ్ రిచర్డ్కు ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో పాటు జల్సాలకు అలవాటుపడి వృద్ధురాలి డబ్బులపై కన్నేసి ఆమెతో నమ్మకంగా ఉంటూ బ్యాంకులో ఉన్న డబ్బులను కాజేసి బైక్, ల్యాప్టాప్ కోనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తరువాత జోసెఫ్ కుత్బీగూడలోని స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నాడు. జూలియట్ ఆంథోని బంధువులు ముందు నుంచి ఆత్మహత్యకాదు.. హత్యేనని చెప్పారు. పోలీసులు లోతైన దర్యాప్తు చేయడంతో హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జోసెఫ్ రిచర్డ్ అదుపులోకి తీసుకుని విచారించగా తానే వృద్ధురాలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.