డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భారీ వర్షాల కారణంగా ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని మాండో గ్రామంలో ఓ ఇళ్లు కుప్ప కూలింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు కనిపించకుండా పోయారు. సమాచారం అందుకున్న అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ నెల 18-21 వరకు అంటే నాలుగు రోజులపాటు పశ్చిమ తీరంలో భారీగా వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది. ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.