జైపూర్ : రాజస్థాన్ ఝున్ఝును జిల్లాలోని ఉదయపూర్వతి పోలీస్స్టేషన్ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మట్టిలో కూరుకుపోయారు. ఈ ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తోడ్పూర గ్రామంలో టన్నెల్ నిర్మాణం చేపడుతుండగా.. ఆ ప్రాంతంలో నలుగురు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టి కూరుకుపోవడంతో అందులో నలుగురు చిన్నారులు చిక్కుకుపోయారు. వీరికి దూరంగా ఉన్న మరో బాలుడు ప్రమాదాన్ని గమనించి కుటుంబీకులకు సమాచారం అందించాడు. వారు వెంటనే స్పందించి మట్టిలో నుంచి వారిని వెలికి తీయగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరొకరు ప్రాణాలతో బయటపడగా.. హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని, ఘటనతో షాక్కు గురైనట్లు ఎస్పీ మనీష్ త్రిపాఠి తెలిపారు. మృతులను నిషా (10), ప్రిన్స్ (7), కృష్ణ (7)గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారులు మట్టిలో గుంతలు తీయగా.. ఒక్కసారి మట్టి కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.