కొవిడ్ కాలంలోనూ జాతీయ సగటుకు మించి.. కరోనా సంక్షోభంలోనూ జాతీయ సగటు కంటే ఎంతో మెరుగైన ఫలితాలను తెలంగాణ సాధించింది. ఒకవైపు దేశ జీడీపీ 8% తగ్గుదల నమోదుకాగా, రాష్ట్ర జీఎస్డీపీ మాత్రం 1.26% మాత్రమే తగ్గింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 20.9 శాతం వృద్ధిని సాధించింది. తలసరి ఆదాయంలో 0.61శాతం వృద్ధిరేటును నమోదు చేసుకున్నది. గతేడాది (2019-20) అంచనాల కంటే ఈసారి సంపద కొంత తగ్గింది. నిరుడు సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల సంపద రూ.9,65,355 కోట్లు ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.9,78,373 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర సంపద లక్ష కోట్లకు పైగా పెరుగుతూ 10 శాతానికి పైగా వృద్ధిరేటు సాధిస్తున్నది. ముందస్తు అంచనాల ప్రకారం ఈ సారి రాష్ట్ర సంపద 13,018 కోట్లు మాత్రమే పెరిగింది. వృద్ధిరేటు తగ్గినా జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో మెరుగ్గా ఉన్నది.
తెలంగాణ ఆవిర్భవించిన మొదటి సంవత్సరం 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రూ.5 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సంపద ఏడేండ్లలో వందశాతం పెరిగింది. జాతీయ సగటుకంటే ఎక్కువ వృద్ధిరేటును సాధిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంజిన్గా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు స్థూల గృహోత్పత్తి రూ.4 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.9.6 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. రాష్టం ఆవిర్భవించకముందు తలసరి ఆదాయం రూ.95,361కాగా ఏడేండ్లలో ఎకాఎకిన రూ.2.27 లక్షలకు పెరిగింది.
రాష్ట్రంలో పురోగమనం, కేంద్రంలో తిరోగమనం
తలసరి ఆదాయంలో వృద్ధిరేటును సాధించిన అతి కొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ప్రస్తుత ధరలవద్ద గతేడాది 2,25,756 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం ఈ సారి 2,27,145 రూపాయలకు పెరిగింది. గతంకంటే ఈ సారి 0.61 శాతం వృద్ధిరేటు చోటుచేసుకుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో వృద్ధి రేటు తిరోగమనంలో ఉన్నది. దేశ జీడీపీ ప్రస్తుత ధరల్లో గత ఏడాది రూ.203.51 లక్షల కోట్లు కాగా ఈసారి రూ.195.86 కోట్లకు తగ్గింది. ఈ తగ్గుదల దాదాపు -8 శాతంగా ఉన్నది. జాతీయ తలసరి ఆదాయంలో కూడా – 4.8 శాతం వరకు తగ్గింది. జాతీయ స్థాయిలో గత సంవత్సరం 1,34,186 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 1,27,768 రూపాయలకు తగ్గింది.
ఆరోగ్య తెలంగాణ దిశగా..
కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం వైరస్ కట్టడికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. పకడ్బందీ వ్యూహం, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ను పకడ్బందీగా నిర్వహించడం వల్ల వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల దోమకాటు వ్యాధులు, టీబీ కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 2019లో 13,361 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 2020లో 2,118 కేసులే నమోదయ్యాయి. మలేరియా కేసులు 1374 నుంచి 803కు త గ్గాయి. చికున్ గున్యా కేసులు 2019లో 1300 నమోదు కాగా, 2020లో 182 మంది మాత్రమే ఆ వ్యాధి బారినపడ్డారు. క్షయవ్యాధి రహిత రాష్ట్రం గా ఎదిగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయి. టీబీ చికిత్సలో సక్సెస్ రేటు 2019లో 87శాతం ఉండగా, 2020లో 90శాతానికి చేరుకున్నది. కంటి వెలుగు పథకం ద్వారా మొత్తం కోటి 54లక్షల మందికి పరీక్షలు చేయగా, 22.9 లక్షల మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా 30 లక్షల మంది ఔట్ పేషెంట్లు, 19.5 లక్షల మంది పేషెంట్లు చికిత్స పొం దారు. వైద్యారోగ్యశాఖ తీసుకున్న చర్యల ద్వారా ప్రసూతి మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 2010లో 110గా ఉంటే ఇప్పుడు 63కు తగ్గింది. కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి అమలు వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో కొనసాగుతున్నది.
విద్యుత్తు
తలసరి విద్యుత్తులో తెలంగాణ టాప్, జాతీయ సగటు కంటే 71% అధికం
100%కు పెరిగిన స్థాపిత విద్యుత్తు సామర్థ్యం
2019-20లో దేశంలో సగటు తలసరి విద్యుత్తు వినియోగం 1208 యూనిట్లు
తెలంగాణ 2071 యూనిట్లు
దేశ సగటు తలసరి వినియోగం కంటే తెలంగాణలో 71% అధికం
2018-19లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1896 యూనిటు
2019-20 నాటికి 9.2 శాతం వృద్ధి నమోదు
ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వృద్ధి నమోదు కాలేదు
కేరళ 9.1%, హిమాచల్ప్రదేశ్ 7.7 %, పశ్చిమ బెంగాల్ 7.6%
హర్యానా 7.1 %, బీహార్ 6.7 %, సిక్కిం 6.4 %, పంజాబ్ 6.1 %, గోవా 5.3 %, కర్నాటకలో 5.2 % వృద్ధి రేటు 2020లో కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెసిడెన్షియల్ ఎనర్జీ సర్వేలో దేశంలో 100 % విద్యుదీకరణ జరిగిన ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నది.
తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉండగా, 2019-20 నాటికి 15,864 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా నష్టాలు అత్యంత తక్కువగా 2.5 శాతం మాత్రమే ఉన్నాయి. నష్టాలను తగ్గించడంతోపాటు.. విద్యుత్తు అవసరాల మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ. 29,106 కోట్లను ఖర్చుచేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 2020 నాటికి మొత్తం 1.6 కోట్ల విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ఇందులో 24.8 లక్షల వ్యవసాయ కనెక్షన్లు. మేడ్చల్ మల్కాజిగిరిలో 13,65,859 కనెక్షన్లు ఉండగా.. ఇందులో 87% గృహ వినియోగదారులే ఉన్నారు. జనగామ జిల్లాలో 2,55,598 కనెక్షన్లలో 31 శాతం వ్యవసాయ సంబంధమైనవి ఉన్నాయి.
పర్యాటకం
గొప్ప వారసత్వ, సాంస్కృతిక సంపద, వైవిధ్యభరితమైన పర్యాటక ప్రాంతాలతో తెలంగాణ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారుతున్నదని సోషియో ఎకనమిక్ సర్వే స్పష్టం చేసింది. వారసత్వ కట్టడాలైన కాకతీయ ఖిల్లా, రామప్ప, వెయ్యి స్తంభాల దేవాలయాలు, చార్మినార్, గోల్కొండ కోట, ఫలక్నుమా ప్యాలెస్, హుస్సేన్సాగర్ సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచల రామాలయం, జోగులాంబ దేవాలయం, కొలనుపాక జైన్ టెంపుల్, మక్కామసీదు, మెదక్ చర్చి తదితర ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఐటీరంగం
ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. 2014-15లో రూ.66.276 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగితే, 2019-20లో రూ.1,28,807 కోట్లకు పెరిగాయి. ఇదే క్రమంలో 3.71 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 5.82లక్షలకు చేరింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), సాఫ్ట్నెట్, టీ-హబ్, వీ హబ్ ఏర్పాటు తర్వాత ఈ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధనలు పెరిగి, ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షిస్తున్నది.
శాంతిభద్రతలు
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైన శాంతిభద్రతల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. మహిళల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేసిన షీటీమ్స్ మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నదని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 331 షీటీమ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో షీటీమ్స్కు వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారని తెలిపింది. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పౌర సేవల కోసం తెచ్చిన హాక్ఐ మొబైల్ యాప్ను మార్చి 2020 వరకు 31,22,563 మంది పౌరులు డౌన్లోడ్ చేసుకున్నట్టు సర్వే వెల్లడించింది. నిరంతర నిఘా కోసం డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల 59వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. భరోసా కేంద్రాల ఏర్పాటుతో బాధితులకు ఒకేచోట న్యాయ, వైద్య, పోలీస్, పర్సనల్ కౌన్సెలింగ్ వంటి అన్ని సేవలు దక్కుతున్నాయని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.
జాతీయ సగటుకంటే తక్కువగా డ్రాపౌట్ రేట్
రాష్ట్రంలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య జాతీయ సగటు తక్కువగా ఉన్నదని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. 2019-20లో బాలికలు 10.7 శాతం, బాలురు 14 శాతం మంది బడి మానేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బాలికలు 16.9 శాతం, బాలురు 17.2 శాతం మంది మధ్యలోనే చదువులను మానేసినట్టు పేర్కొంది. కరోనా కారణంగా చేపట్టిన డిజిటల్ క్లాసులను 85 శాతం మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా 11.3 లక్షల మంది, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా 2.2 లక్షల మంది పాఠాలు విన్నారని పేర్కొంది.
2026 నాటికి సగం జనాభా పట్టణాల్లోనే
తెలంగాణలో 2026 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తుందని సామాజిక ఆర్థిక సర్వే అంచనా
ప్రస్తుతం పట్టణాల్లో జనాభా 38.9శాతం
అత్యంత వేగంగా పట్టణీకరణ
దేశంలోనే అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్
ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు
రాష్ట్రంలోగణనీయంగా పెరుగుతున్న ఉద్యాన పంటల ఉత్పత్తులు
నాలుగేండ్లలోభారీగా పెరిగిన పండ్లు, కూరగాయలు,
సుగంధ ద్రవ్యాలు, పూలు, ఇతర పంటల దిగుబడులు
పామాయిల్ సాగు 2014-15లో 57,873 ఎకరాల్లో ఉండగా, 2018-19 నాటికి 1,97,632 (12.1%) ఎకరాలు పెరిగింది.
గొర్రెల పంపిణీ వల్ల రాష్ట్రంలో 4.46 లక్షల టన్నుల నుంచి 8.5 లక్షల టన్నులకు పెరిగిన మాంసం ఉత్పత్తి
రొయ్యల దిగుబడి రూ.5,400 కోట్లకు పెరిగినట్టు సర్వే వెల్లడించింది.
రైతు సగటు భూమి ఆదిలాబాద్లో ఎక్కువ
రాష్ట్ర సగటు 2.5 ఎకరాలు.. దేశ సగటు 2.7 ఎకరాలు
రాష్ట్రంలో రైతుల వద్ద సగటు వ్యవసాయ భూమి ఆదిలాబాద్ జిల్లాలో అధికం
వరంగల్ రూరల్ జిల్లాలో తక్కువ
ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు వద్ద సగటున 4.1 ఎకరాల భూమి
వరంగల్ రూరల్ జిల్లాలో 1.6 ఎకరాలు
కుమ్రంభీం జిల్లాలో 4 ఎకరాలు
నారాయణపేట జల్లాలో 3.3 ఎకరాలు
కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే రైతు సగటు భూమి 3 ఎకరాలు
మిగతా జిల్లాల్లో 1.6 ఎకరాల నుంచి 2.8 ఎకరాలు