న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా ఈ పరంపరకు కాస్తా బ్రేక్ పడింది. ఆదివారం ఆ సంఖ్య 3.6 లక్షలకు పడిపోయింది. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేల దిగువకు పడిపోయాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,66,161 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575కు చేరింది. ఇందులో 1,86,71,222 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 37,45,237 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 3,754 మంది బాధితులు కరోనాతో మరణించడంతో మొత్తం మృతులు 2,46,116కు పెరిగారు. అదేవిధంగా కొత్తగా 3,53,818 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 17,01,76,603 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో ఒకేరోజులో 48,401 కేసులు, 572 మంది మరణించారు. ఇక కర్ణాకటలో 47,930 మంది కరోనా బారినపడగా, 490 మంది బాధితులు మృతిచెందారు. కేరళలో 35,801 కేసులు నమోదవగా, ఉత్తరప్రదేశ్లో 296 మంది చనిపోయారు.
కాగా, శనివారంతో ముగిసిన వారం నాటికి దేశవ్యాప్తంగా 27 వేలకుపైగా కరోనా బాధితులు మరణించగా, 27.4 లక్షల మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. దేశంలో వారంలో ఇంత భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి