యాదాద్రి, మే1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల య పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానాలయంలో కృష్ణశిలల నిర్మాణ పనులు పూర్తికాగా, మండపాల్లో చెక్కిన వివిధ రకాల రూపాలు భక్తులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కృష్ణశిలల కళాకృతులు కనువిందు చేయనున్నాయి. ప్రధానాలయంలో ప్రథమ, ద్వితీ య ప్రాకారాల్లోని సాలాహారాలకు 240 దేవతామూర్తులు, దశావతారాలు, వివిధ అవతారాల అమ్మవారి విగ్రహాలను అమర్చారు. ద్వితీయ ప్రాకారంలోని బయటి ప్రాకారంలో నిర్మించి అష్టభుజి మండపాలకు గల పిల్లర్లకు వివిధ రకాల దేవతామూర్తులు, దశావతారాలు, అమ్మవారు, విగ్రహాలతోపాటు తెలంగాణ సంస్కృతి, వివిధ రకాల నాణేలను చెక్కారు. ఈ కాలంలో వాడిన నాణేలు, కరెన్సీలను మరో వెయ్యేండ్లు గుర్త్తుండిపోయేలా పిల్లర్లలో భద్రపరిచారు. అష్టభుజి మండపాల్లో నిర్మించిన 158 పిల్లర్లకు చెక్కిన వివిధ రకాల రూపాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి.