నగరానికి చేరుకున్న బ్యాలెట్ బాక్స్లు
ఇండోర్ స్టేడియంలో భద్రం
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన
వరంగల్, ఏప్రిల్ 9: గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలతోపాటు పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 181 మంది ఆర్వో, ఏఆర్వోలకు ఈ నెల 11న శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో డివిజన్కు ఆర్వో, ఏఆర్వో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాలను విడుదల చేసిన అధికారులు వాటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. గ్రేటర్, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 14న ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఆ దిశలో గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రేటర్కు చేరుకున్న బ్యాలెట్ బాక్స్లు
గ్రేటర్ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్లు వచ్చేశాయి. ఈ సారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి పరకాల నుంచి 1000 బ్యాలెట్ బాక్స్లు గ్రేటర్ కార్పొరేషన్కు చేరుకున్నాయి. గ్రేటర్లోని 66 డివిజన్లలో 817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 817 బ్యాలెట్ బాక్స్లకు అదనంగా 20 శాతం బ్యాలెట్ బాక్స్లను సిద్ధంగా ఉంచుతున్నారు. బ్యాలెట్ బాక్స్లను కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో పోలీసుల రక్షణలో భద్రపరిచారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతులు
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు గ్రేటర్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ముసాయిదాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, మరుగుదొడ్లు లాంటి మౌలిక వసతులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాగునీటి వసతి ఉండేలా చూస్తున్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. దీంతో సిబ్బందితో పాటు ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేసేలా కలెక్టర్, కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన గ్రేటర్ కమిషనర్ మిగతా సిబ్బంది నుంచి నివేదికను తెప్పించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..