న్యూఢిల్లీ: ఆలిండియా కోటా స్కీమ్ కింద మెడికల్, డెంటల్ గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ( EWS Reservation ) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. ఈ రిజర్వేషన్లు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, బీడీఎస్, ఎండీఎస్, డిప్లొమా మెడికల్ కోర్సుల్లాంటి అన్నింటికీ వర్తిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా సోమవారం ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కోరారు.
బుధవారం పలువురు బీజేపీ ఎంపీలు, ఓబీసీ కమ్యూనిటీ సభ్యులు కూడా మోదీని కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నిర్ణయం ఎంబీబీఎస్లోని 1500 మంది ఓబీసీలు, 550 ఈడబ్యూఎస్ విద్యార్థులకు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 2500 మంది ఓబీసీలు, 1000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మేలు చేయనుందని ఆరోగ్య శాఖ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలు ఇక నుంచి ఈ ఆలిండియా కోటా స్కీమ్ కింద ఉన్న ఈ రిజర్వేషన్లపై ఏ రాష్ట్రంలో అయినా సీట్ల కోసం పోటీ పడవచ్చని తెలిపింది.