న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కేవలం 15 రోజుల్లో 25 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 లక్షల కేసులు నమోదుకావడానికి 107 రోజుల సమయం పడితే.. ఇప్పుడు 15 రోజుల్లోనే ఇన్ని కేసులు వెలుగుచూడటం వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తున్నదో తెలియజేస్తున్నది. దేశంలో గతేడాది కరోనా ఫస్ట్వేవ్ ఉద్ధృతస్థాయిలో ఉన్నప్పుడు ఆగస్టు 7నాటికి 20 లక్షల కేసులు నమోదయ్యాయి. అదే నెల 23వతేదీ నాటికి 30 లక్షలకు చేరాయి. అంటే 16 రోజుల్లో 10 లక్షల కేసులు వెలుగుచూశాయి. కానీ ఇప్పుడు సెకండ్వేవ్లో కేవలం 15 రోజుల్లో 25 లక్షల కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 19 నాటికి కరోనా కేసులు కోటికి చేరగా.. దాదాపు 107 రోజుల తర్వాత ఈ నెల 5న కోటి 25 లక్షలకు చేరాయి. గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ 2 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సోమవారం నాటికి కేసుల సంఖ్య కోటిన్నర దాటాయి. అంటే, కేవలం 15 రోజుల్లోనే (ఏప్రిల్ 5-19 తేదీల మధ్య) 25 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం నుంచి సోమవారం నాటికి 24 గంటల్లో 2,73,810 కేసులు వెలుగుచూశాయి.