కరోనా నియంత్రణకు కృషిచేయాలి
సూపర్ స్ప్రెడర్లంతా వ్యాక్సిన్ తీసుకోవాలి
వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల
మోమిన్పేట, మే 29: సూపర్ స్ప్రెడర్లు ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకుని కరోనా నియంత్రణకు కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. శనివారం అనంతగిరి పీహెచ్సీలో సూపర్ స్ప్రెడర్లకు ఇస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా టీకా తీసుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ప్రజలకు అర్థమయ్యేలా పూర్తి అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మున్సిపాల్ మాజీ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేశ్కుమార్ కొవిడ్ బాధితులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, కౌన్సిలర్ రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్లో 66 మంది టీకా..
కొడంగల్, మే 29: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం రెండు రోజులుగా మండలంలోని సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నది. ఇందులో భాగంగా శనివారం కొడంగల్ సీహెచ్సీ పరిధిలో మొత్తంగా 264 మందికిగాను మొదటిరోజు 50 మందికి, రెండో రోజు 66 మందికి వ్యాక్సిన్ వేశారు. సూపర్ స్రైడర్లు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, ప్రభుత్వం అందించిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ వీణ సూచించారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
బొంరాస్పేట, మే 29: కరోనా కట్టడిలో భాగంగా సూపర్ స్ప్రెడర్లకు టీకా పంపిణీ కార్యక్రమం శనివారం రెండో రోజు కూడా కొనసాగింది. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన ఆటో డ్రైవర్లు, రేషన్ డీలర్లు, ఫర్టిలైజర్ దుకాణాల సిబ్బంది, గ్యాస్ డెలివరీ బాయ్స్తో పాటు మీడియా సిబ్బందికి టీకాలు వేశారు. ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీకా తీసుకుంటున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 62 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి రవీంద్ర యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్వో శివరాజ్, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, ఆయూష్ ఫార్మాసిస్టు సుదర్శన్, హెల్త్ సూపర్వైజర్ మణిమాల, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.