మా తాతలు, తల్లిదండ్రులు భక్తి గీతాలు, భజనలు పాడే వారు… బుర్రకథలు, హరికథలు, పద్యాలు, శ్లోకాలు చాలా చెప్పే వారు అంటూ నేటి యువతరం గొప్పగా చెప్పుకోవడానికే పరిమితమవుతున్నది. హైందవ ధర్మాన్ని కాపాడడంలో కీలకంగా భావించే స్తోత్ర పాఠాలు పిల్లలకు నేర్పించే వారు లేరు. తల్లిదండ్రులు సైతం ఆ దిశగా ఆసక్తి చూపడం లేదు. కానీ ఓ ఔత్సాహిక రచయిత్రి పిల్లలను ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయిస్తున్నారు. బాల్య దశలోనే పిల్లలను సన్మార్గంలో నడిపించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు.
రహ్మత్నగర్ డివిజన్ శ్రీరాంనగర్ పోచమ్మ ఆలయంలో రచయిత్రి కొండపాక మాధవి రాఘవన్ స్థానిక చిన్నారులకు శ్లోకాలు…స్తోత్రాలు….భక్తి గీతాలు నేర్పిస్తూ..పలువురి మన్ననలు పొందుతున్నారు. లాక్డౌన్ కాలంలో స్ఫూరించిన ఈ ఆలోచనకు కార్యరూపమిచ్చిన ఆమె.. ఆలయంలో ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు ప్రారంభించారు. నాలుగు నెలలుగా నిర్వహిస్తున్న ఈ శిక్షణకు మంచి ఆదరణ లభిస్తున్నది. తమ పిల్లలకు చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక అంశాలపై తర్ఫీదునిస్తుండటంతో తల్లిదండ్రులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే ఆరు నెలల పాటు లలిత సహస్ర నామాలు నేర్పిస్తున్నట్లు మాధవి తెలిపారు.
ఆ తరువాత పిల్లలు, తల్లిదండ్రుల ఆసక్తి మేరకు మరో ఆరు నెలలు విష్ణు సహస్ర నామాలు నేర్పించనున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలకు నవరాత్రి ఉత్సవాల వరకు మొదటి విడత శిక్షణ ఇస్తున్నాం. సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రాలు, కృష్ణాష్టకం వంటివి నేర్పించడం వల్ల చిన్ననాటి నుంచే హిందూ ధర్మంపై అవగాహన ఏర్పడుతుంది. ప్రాథమిక విద్యలో భాగంగా గురు స్తోత్రాలు, రామస్తుతి లాంటివి నేర్పించాను. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుంచి 6 గంటల వరకు పిల్లలకు భక్తి గీతాలు నేర్పిస్తున్నాం. ఔత్సాహికులు 96763 74886, 99660 72550 నంబర్లలో సంప్రదించవచ్చు.