న్యూఢిల్లీ: కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులను తగ్గించబోమని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. గత ఏడాది కరోనా వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా 2020 మార్చిలో నిలిచిన దేశీయ విమాన సర్వీసులను గత ఏడాది మే 25 నుంచి పునరుద్ధరించినట్లు చెప్పారు. నాటి నుంచి దశల వారీగా విమాన సర్వీసులను పెంచుతున్నామని ప్రస్తుతం ఇది 80 శాతానికి చేరిందని వివరించారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే వేసవి షెడ్యూల్ నుంచి విమాన సేవలను 100 శాతం అందుబాటులోకి తేవాలన్నది తమ ఉద్దేశమన్నారు.
మరోవైపు ప్రస్తుతం కరోనా రెండవ స్పైక్ కారణంగా విమానాలను వంద శాతం నడుపలేమని హర్దీప్ సింగ్ పురి తెలిపారు. విమాన ప్రయాణాల్లో మాస్కులు ధరించని వారిని, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించని వారిని నిషేధిత జాబితాలో చేర్చాలని వియానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు గట్టిగా చెప్పామన్నారు.