లారీలను అడ్డుకున్న బీజేపీ
సరైన పద్ధతి కాదని టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
చిలిపిచెడ్, ఏప్రిల్ 12 : ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం లారీలో తీసుకుపోతున్న ఇసుక లారీలను సోమవారం బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామ శివారులో మంజీరా నదిలోనిర్మిస్తున్న చెక్ డ్యాం పనుల కోసం తీసుకుపోతున్న ఇసుక లారీలను బీజేపీ అడ్దుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత శాఖ వారు ఇచ్చిన అనుమతి పత్రాన్ని వారికి చూపించి ఇసుక లారీలను పంపించారు. అన్ని అనుమతులు ఉన్నా ఇలా ఇబ్బందులు కలిగించడం సరైన పద్ధతి కాదని ఎస్ఐ తెలిపారు.
లారీలను అడ్డుకోవడం సిగ్గుచేటు..
ఇసుక లారీలను బీజేపీ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటని మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. శీలాంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామ శివారులో నిర్మించిన చెక్ డ్యాం నుంచి ఫైజాబాద్ శివారులోని నిర్మిస్తున్న చెక్ డ్యాంకు ఇసుకను లారీల ద్వారా తీసుకువస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాశ్రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా రైతుబంధు సభ్యుడు సయ్యద్హుస్సేన్, ఎంపీటీసీ మల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు గోపాల్రెడ్డి, పరశురాంరెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, వెంకటేశం, ముకుందరెడ్డి, సత్యం, పోచయ్య పాల్గొన్నారు.