హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ): ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ గడువును ఈ నెల 10 వరకు పొడగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ తెలిపారు. అపరాధ రుసుము లేని దరఖాస్తుకు గురువారంతో ముగియాల్సిన గడువును మరోవారం రోజులపాటు పొడగించామని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, గతేడాది కన్నా ఈసారి టీఎస్ ఎంసెట్కు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. మార్చి 20న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2.1 లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. గతేడాది వచ్చిన 1.92 లక్షల దరఖాస్తుల కంటే ఈసారి 18 వేలు అధికంగా రావడం విశేషం. ప్రస్తుతం గడువును పొడిగించినందున దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది.