వజ్రాలు, అణు వ్యర్థాలతో తయారీ
అంతరిక్ష పరిశోధనల కోసం అభివృద్ధి
2023 కల్లా అందుబాటులోకి..
ప్రయోగాలు చేస్తున్న అమెరికా కంపెనీ
మొబైల్స్ కోసమూ తయారీకి యత్నాలు
వాటి లైఫ్ 9 ఏండ్లు ఉండొచ్చని వెల్లడి
న్యూయార్క్, ఏప్రిల్ 3: మొబైల్ డేటా వాడకం పెరిగిన ఈ రోజుల్లో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడం పెద్ద సమస్య. ఎక్కడికైనా వెళ్లినా వెంట ఛార్జర్, పవర్బ్యాంకులు తీసుకెళ్లాలి. ఈ సోదంతా లేకుండా అసలు ఛార్జింగ్ చేయాల్సిన అవసరమే లేని బ్యాటరీ ఉంటే.. అమెరికాకు చెందిన ఎన్డీబీ అనే స్టార్టప్ సంస్థ.. ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నది. నానో డైమండ్ బ్యాటరీ (ఎన్డీబీ) పేరుతో అణు వ్యర్థాలు, వజ్రాలతో ఈ బ్యాటరీలను తయారు చేయడం విశేషం. 2012 నుంచి ఈ సంస్థ బ్యాటరీ తయారీలో నిమగ్నమై ఉన్నది. 2023లో తొలి బ్యాటరీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ కంపెనీ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల కోసం ఈ బ్యాటరీని తయారు చేస్తున్నది. ఫోన్లు, ల్యాప్టాప్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా బ్యాటరీలను తయారు చేస్తామని కంపెనీ సీఈవో నైమా గోల్షరీఫీ చెప్పారు. ఇవి ఛార్జింగ్ అవసరం లేకుండా 9 ఏండ్ల దాకా పనిచేస్తాయన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం రోదసి కోసం చేస్తున్న నానో డైమండ్ బ్యాటరీ ఛార్జింగ్ అవసరం లేకుండా 28 వేల ఏండ్లు పనిచేస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
ఎన్డీబీ బ్యాటరీ సాధారణ వోల్టాయిక్ బ్యాటరీలాగా (గోడ గడియారం సెల్లాగా) పనిచేస్తుంది. వజ్రాలు మంచి ఉష్ణవాహకాలు. ఎన్డీబీ బ్యాటరీలో వజ్రాలు, అణు వ్యర్థాలు పొరలు పొరలుగా ఉంటాయి. అణువ్యర్థాల నుంచి వెలువడే రేడియో ధార్మికతను, ఉష్ణాన్ని వజ్రాలు తీసుకొని మరో పొరకు పంపిస్తాయి. ఇలా పొరల మధ్య రసాయనిక చర్యతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా అణువ్యర్థాలు వేల సంవత్సరాలపాటు తమ నుంచి రేడియో ధార్మికతను విడుదల చేస్తాయి. అందువల్లనే ఈ బ్యాటరీలు వేల సంవత్సరాలు పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి :
‘క్యాపిటల్’ వద్ద కారు బీభత్సం
రోబో వేసిన పెయింటింగ్కు రూ.5 కోట్లు