సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతం
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా వైద్యపరీక్షల సర్వే కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. వైద్యపరీక్షల సర్వేపై వినోద్కుమార్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడారు. ఇంటింటా పరీక్షలు ఏవిధంగా చేస్తున్నారు? ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రజల సహకారం ఎలా ఉంది? లక్షణాలు కనిపించిన వారికి మీరు ఇస్తున్న సూచనలు ఏమిటి? కిట్లు ఎలా తీసుకుంటున్నారు? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని వినోద్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి చాలా గొప్పదని పేర్కొన్నారు.