నాలుగైదు రెట్లు ఎక్కువగా మన రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఈ ఔషధం ఏ పరిస్థితిలో వాడాలి అన్న ఆలోచనైనా లేకుండా నిజంగా అవసరమైనవారికి దొరకని పరిస్థితిని కల్పిస్తున్నారు. వైరస్ లోడ్ తీవ్రంగా లేకపోతే రెమ్డెసివిర్ అవసరమే లేదు. అయినప్పటికీ రెమ్డెసివిర్ను వాడితే తీవ్రమైన దుష్ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులే చెప్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాధికి రెమ్డెసివిర్ ఇంజక్షన్ దివ్యౌషధమా? కరోనా సోకితే దాన్ని వాడాల్సిందేనా? ఇప్పుడు రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానలు, వైద్యులు, రోగులు ఈ రెమ్డెసివిర్ గురించి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొద్దిరోజులుగా మార్కెట్లో తెగ డిమాండ్ ఏర్పడింది. విచిత్రమేమంటే కొందరు రోగులు రెమ్డెసివిర్ అందుబాటులో ఉంటేనే దవాఖానలో చేరుతామని షరతులు పెడుతున్నారు. కానీ.. ఇది అనవసరంగా తీసుకొంటే దాని వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కరోనా చికిత్సలో వైద్యులు సిఫారసు చేస్తున్న ఔషధాల్లో రెమ్డెసివిర్ ఒకటి. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి శరీరంలో వైరస్లోడ్ ఎక్కువగా ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఔషధాన్ని వాడాలి. రోగికి రెమ్డెసివిర్ అవసరం అనుకొంటే వైద్యులే సూచిస్తారు. కానీ కరోనా సోకితే రెమ్డెసివిర్ తప్ప మరో మందు లేదు.. అదే సంజీవని అన్నట్టుగా ప్రచారం సాగడంతో ప్రజల్లో అపోహలు పెరిగాయి. అవసరం లేకపోయినా కొనడంతో కొరత ఏర్పడే ప్రమాదమున్నది. తమ దవాఖానలో రెమ్డెసివిర్ ఔషధం లేకపోవడం కొవిడ్ రోగులు చికిత్స కూడా తీసుకోవడం లేదని, రెమ్డెసివిర్ పంపాలని వరంగల్లో ఓ దవాఖాన యాజమాన్యం ఫార్మాసంస్థలను సంప్రదించిందటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇదొక్కటే ఆంతిమ ఔషధం కాదు
ఇంతవరకు కరోనా వ్యాధికి సరైన చికిత్స ఇది.. అని చెప్పేందుకు ఎలాంటి స్పష్టమైన అధ్యయన ఫలితాలు వెలువడలేదు. ప్రపంచమంతటా కూడా వ్యాధి లక్షణాలు ఆధారంగానే రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వారికి టోస్లిజోమాబ్, రెమ్డెసివిర్, అజిత్రోమైసిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఫావిఫిరావిర్ వంటి మందులను వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంలో వైరస్ మొదటి దశలో ఎక్కువగా టోస్లిజొమాబ్ ఇంజెక్షన్కు డిమాండ్ ఏర్పడింది. ఈ ఇంజెక్షన్ వల్ల ఎదురైన దుష్పరిణామాలను కూడా లెక్కచేయకుండా వినియోగించడంతో ఒక్కో వాయిల్ ధర లక్షల్లో పలికింది. బ్లాక్ మార్కెట్లో కూడా అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు అదేరీతిగా రెమ్డెసివర్ ఇంజెక్షన్ దుర్వినియోగం మొదలైంది. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి రెమ్డెసివిర్ ఇస్తే కొంత సానుకూల ఫలితం వచ్చినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. ఈ అధ్యయనాలను బట్టి రెమ్డెసివిర్ను ప్రయోగాత్మకంగా కొవిడ్ చికిత్సలో వాడుతున్నారు. కానీ రెమ్డెసివిర్ ఒక్కటే కరోనాకు మందు అన్న భావన చాలా మందిలో బలంగా నాటుకొని పోయింది. ఎందుకైనా మంచిదని కొని దాచుకొంటున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించకుండానే వారికి వారే ఇంజక్షన్ వేసుకొంటున్నారు. శరీరంలో నిర్దిష్టమైన పరిమితిలో వైరస్ ఉన్నవారే వేసుకోవాల్సిన ఈ మందు అనవసరంగా వేసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే రెమ్డెసివిర్ వైరస్ లేకపోయినా ఇంజక్షన్ చేసుకొంటే.. తీవ్ర దుష్ఫ్రభావాలు వస్తున్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
అవసరమైనవారికి అందడం లేదు
దేశంలో కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతుండటంతో రెమ్డెసివిర్కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ డిమాండ్ అనవసర డిమాండ్. కరోనా సోకినవారిలో కేవలం 10 శాతం మందిలోనే తీవ్ర లక్షణాలు ఉంటున్నాయి. వీరిలో కూడా 5 శాతం మంది వైద్యుల అవసరం. ప్రస్తుత గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వంద మందిలో 5-8 మందికి మాత్రమే ఈ ఇంజెక్షన్ అవసరం. ఇప్పటికే అనవసరంగా డిమాండ్ కల్పించడం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో రెమ్డెసివిర్ను అధిక ధరలకు అమ్ముతున్నారు. రూ.800 విలువ చేసే ఒక్కో ఇంజక్షన్ను రూ. 5వేలకు పైగా అమ్ముతున్నారనే ప్రచారం జరుగుతున్నది.
అతి సర్వత్ర వర్జయేత్ అన్నది సామెత.. ఏదైనా అతిగా వాడితే దాని వల్ల దుష్ప్రభావాలే ఎదురవుతాయి. కరోనా నుంచి బయటపడటానికి అతిగా వాడుతున్న రెమ్డెసివిర్ వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉత్పన్నం కాబోతున్నాయి. కరోనా వస్తుందేమోనని కొందరు.. ఎందుకైనా మంచిదని ఇంకొందరు.. వాడితే పోయేదేమని మరికొందరు.. రెమ్డెసివిర్ను ఇష్టం వచ్చినట్టు కొంటున్నారు.
మ్యాజికల్ డ్రగ్ కాదు
రెమ్డెసివిర్ యాంటీ వైరల్ డ్రగ్. ఇష్టారీతిగా వాడితే అనేక సమస్యలు వస్తాయి. ఇప్పటికీ ఇది ట్రయల్ డ్రగ్ మాత్రమే. దవాఖానల్లో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి. వైరస్ వచ్చిన 90% మంది ఇంటి వద్దనే కోలుకుంటున్నారు. కేవలం 10% మందికి మాత్రమే దవాఖానలో చికిత్స అవసరం. ఇందులో 5-8 మందికి మాత్రమే ఈ తరహా మందులు వాడే పరిస్థితి వస్తున్నది.
జి శ్రీనివాస రావు, ప్రజారోగ్య సంచాలకులు కరోనా చికిత్సలో పని చేసే మందేం కాదు:
రెమ్డెసివిర్ వల్ల కరోనా ప్రభావం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ఇతర పరిశోధనా సంస్థలు వెల్లడించలేదు. ఎక్స్పర్మెంటల్ థెరపీలో భాగంగా వ్యాధి మోడరేట్ దశలో ఉన్న వారికి మాత్రం వాడుతున్నారు. రెమ్డెసివిర్ను చికిత్సలో కచ్చితంగా వాడాలి అన్నదేం లేదు. లక్షణాలు వచ్చిన 10 రోజుల్లోనే ఇది వాడాలి. అప్పుడే కొంత ప్రభావం ఉంటుంది.
డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ హెడ్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ
రెమ్డెసివిర్కు కొరత లేదు:
రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు మన వద్ద పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే 10వేల డోసులు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో 45వేల డోసులు వస్తున్నాయి. వచ్చే పది రోజుల్లో మొత్తం 2లక్షల డోసులు వస్తున్నాయి. అన్ని అవసరమైన మందుల వలే వీటిని కొనుగోలు చేస్తున్నాం. రెమ్డెసివిర్కు కొరత ఉండే అవకాశం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయి. అవసరమైన పేషెంట్లకు చికిత్సలో భాగంగా అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.
కె చంద్రశేఖర్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ