అంచనాకు అధికారులు సన్నద్ధం
నేలకొరిగిన వరి పంట
రాలిన గింజలు.. తడిసిన ధాన్యం
పల్లెల్లో వివరాలు సేకరిస్తున్న వ్యవసాయాధికారులు
వికారాబాద్, ఏప్రిల్ 14, (నమస్తే తెలంగాణ) : వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. చెరువులు, కుంటలు నిండటంతో భూగర్భ జలాలు అనుకున్న స్థాయి కంటే అధికంగానే వచ్చాయి. బోరు, బావుల్లోనూ నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు ఈసారి యాసంగిలో గతంలో కంటే అధికంగా వరి సాగు చేశారు. పంట కోతలు మొదలు పెట్టారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ, ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కోతకు వచ్చిన పంటలు నీటిలో మునిగిపోయి ధాన్యం గింజలు నేలరాలాయి. దీంతో అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి.
ధారూర్ మండలంలోని ఏడు గ్రామాల్లో 29 ఎకరాల్లో జొన్న పంట, పెద్ద్దేముల్లో వరి పంట దెబ్బతిన్నదని అధికారులు చెబుతున్నారు. వికారాబాద్ మండలంలోని మహ్మదాన్పల్లిలో 39.3 మి.మీ, కులకచర్ల మండలం ముజాహిద్పూర్లో రెండు రోజుల్లో 55.3మి. మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 12.3 మి. మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో బుధవారం సగటున 19.7 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పం 18.4గా నమోదు చేసుకుంది.
రెండు మండలాల్లోనే నష్టం అధికం..
జిల్లాలోని ధారూర్, పెద్దెముల్ మండలాల్లో ఎక్కువగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో వరితో పాటు కూరగాయలు, పండ్లు, ఇతర పంటలు కలిపి 1.50 లక్షల ఎకరా సాగు చేశారు. ఇందులో వరి 68874, జొన్న 9972 ఎకరాలు, కుసుమ 1755 ఎకరాలు, శనగ 20786, వేరు శనగ 8238 చొప్పున లక్షా 9వేల 625 ఎకరాలు సాగులో ఉన్నది.
జాగ్రత్తలు తీసుకోవాలి
రైతులు ధాన్యం పంట కోసిన తర్వాత కల్లాల వద్ద ధాన్యం రాసులపై టార్పాలిన్ కప్పి జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తాండూరు డివిజన్ పరిధిలో, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్పేట్, దోమ, మర్పల్లి, మోమిన్పేట, మండపేట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బుధవారం తెల్లవారుజామున కురిసింది. నేడు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి, ఏప్రిల్ 14, (నమస్తే తెలంగాణ) : అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం పొద్దుపోయిన తర్వాత ఈదురు గాలులతో కూడిన వర్షంతో మామిడితోపాటు వరి పంటకు నష్టం వాటిల్లింది.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లావ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ ప్రభావంతో మామిడి కాయలు నేలరాలాయి. జిల్లాలోని మొయినాబాద్, షాబాద్, యాచారం తదితర మండలాల్లో భారీగా వీచిన ఈదురుగాలులకు 15 శాతం మేర మామిడి రైతులు నష్టపోయినట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 25వేల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, షాద్నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. తడిచిన ధాన్యాన్ని వారం రోజులపాటు ఆరబెట్టిన అనంతరం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 35 వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు.