హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని, ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టంచేశారు. గతంలో కరోనా ఒక వ్యక్తికి సోకితే అతని వరకే పరిమితం అయ్యేదని, కానీ ప్రస్తుత వైరస్ తీవ్రత కారణంగా ఇంట్లో ఒకరికి సోకితే గంటల్లోనే కుటుంబసభ్యులకు అంటుకొనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అవరమైతే ఇంట్లోనూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ పరిణామాలను బట్టి వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని, ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టంచేశారు.
బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగైదు వారాలుగా రాష్ట్రంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇదే పరిస్థితి దాదాపు 6 వారాలపాటు కొనసాగే అవకాశం ఉన్నదని వెల్లడించారు. నిర్లక్ష్యంచేస్తే రాష్ట్రం మహారాష్ట్రను మించిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా దవాఖానల్లో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో పడకల కొరత ఏర్పడవచ్చని చెప్పారు. ప్రజల జీవనోపాధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినకూడదని ప్రభుత్వం లాక్డౌన్, కర్ఫ్యూ విధించకపోవడానికి ప్రధానకారణమని వివరించారు. ఈ పరిస్థితులను అర్థంచేసుకొని ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు.