దేవరకద్ర రూరల్, ఏప్రిల్10: కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచి ఏడాదిపాటు నీరు నిల్వ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రైతులు తమ కాళ్లమీద నిలబడేలా వారికి భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మిపల్లి, దేవరకద్ర, గోపన్పల్లి, కౌకుంట్ల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలను జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్షకులకు రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలిచామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో సైతం పచ్చని పొలాలు కనబడుతున్నాయని అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి పెద్దదిక్కుగా నిలిచారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నదని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి 5 వేల ఎకరాలకు క్లస్టర్ ఏర్పాటు చేసి రైతువేదికలు నిర్మించినట్లు తెలిపారు.
వీటి ద్వారా సాగు మెళకువలు రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, రైతుబీమా చెక్కులను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే ఆల పంపిణీ చేశారు. గోపన్పల్లికి చెందిన నలుగురు రైతులకు 75శాతం రాయితీపై మంజూరైన తుంపర సేద్య పరికరాలు మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ఎంపీపీ సుజాత, సర్పంచ్ స్వప్న, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొండ సుగుణ, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శివరాజు, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు కిష్టన్న, కార్యదర్శి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ గోపాల్, నాయకులు శ్రీకాంత్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, డీఎస్పీ శ్రీధర్, సీఐ రజిత పాల్గొన్నారు.