పల్లెల్లో బెట్టింగ్ బంగార్రాజుల మకాం..!
బాల్.. బాల్కో రేటు.. పరుగు పరుగుకో పందెం..
క్షణాల్లోనే కాసులు మాయం n బెట్టింగ్కు దిగితే బతుకే అయోమయం
జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మాఫియా
ఆన్లైన్ వేదికగా పందెంరాయుళ్ల కాసుల వేట
బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరికలు
చౌటుప్పల్ ఏప్రిల్ 6: ఐపీఎల్.. పొట్టి క్రికెట్లో దీనికున్న క్రేజే వేరు. బాల్.. బాల్కు ఫలితం మారుతూ మంచి కిక్ ఇచ్చే క్రికెట్లో పరుగు పరుగుకో పందెంకాసే కేటుగాళ్లు ఉన్నారు. బెట్టింగ్ గురించి తెలుసుకునేలోపే బెగ్గర్గా మార్చే పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ వికృత క్రీడ ఇప్పుడు పల్లె వాకిలిని పలుకరిస్తోంది. తెలుసో తెలియకో.. సరదా మాటున చేసే చిన్న ప్రయత్నం కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. బాధితులను అజ్ఞాతంలోకో…అనంతలోకాలకో పంపిస్తున్నది. గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్ వేదికగా జరిగే ఈ తతంగం బాధితులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ బాగోతాన్ని నష్టం జరుగకముందే నివారించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ఎక్కడ బెట్టింగ్ జరిగినా సమాచారం ఇవ్వాలని, బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నది.
బెట్టింగ్ ..బెట్టింగ్ ఈ మాట అందరికీ తెలిసిందే. ఇక ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు ఫుల్ క్రేజ్ ఉంటది. దీనికున్న క్రేజ్ దృష్ట్యా ఎంతో మంది బెట్టింగ్లకు తెరలేపుతూ రూ. లక్షలు కాజేస్తుంటారు. బాల్ బాల్కు బెట్టింగ్.. ఓవర్ ఓవర్కు బెట్టింగ్.. తన ఫెవరేట్ ప్లేయర్ ఎన్ని పరుగులు చేస్తాడని బెట్టింగ్..ఈ బాల్కు బ్యాట్స్మెన్ అవుటవుతాడని బెట్టింగ్..20 ఓవర్లలో ఎన్ని పరుగులు చేస్తారని బెట్టింగ్.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ కాస్తారు. ఈ బెట్టింగ్ మాయలో పడితే ఇక అంతే సంగతి. రూ. వెయ్యి నుంచి మొదలవుతున్న బెట్టింగ్ రూ. లక్షల వరకు కొనసాగుతున్నది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఎంతో మంది రూ. లక్షలు పోగొట్టుకుంటూ లబోదిబోమంటున్నారు. బెట్టింగ్ భ్రమలో పడుతున్న యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. తీరా తాము మోసపోయమని తెలుసుకునే లోపే భారీగా అప్పుల్లో కూరుకుపోయి గ్రామాలను వదిలి సదూర ప్రాం తాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది.
అన్ని మండలాల్లో..
జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ కాసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యం గా చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్టతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈనెల 9 నుంచి ఐపీఎల్ మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నిర్వాహకులు బెట్టింగ్కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు బార్లు, రెస్టారెంట్లు, మండల శివారు ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
జేబులు నింపుకొంటున్న కమీషన్దారులు
బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏజెంట్లు భారీగా డబ్బులు దండుకుంటారు. బెట్టింగ్లో పాల్గొంటున్న వారు ఏజెంట్లకు 10 నుంచి 20 శాతం కమీషన్ ఇవ్వా ల్సి ఉంటుంది. రూ. లక్ష బెట్టింగ్ కాస్తే రూ. 10 నుంచి 20 వేలు వారికి ముట్టజెప్పాల్సి వస్తుంది. ఈ డబ్బుల్లో కొంత బెట్టింగ్కు పాల్పడుతున్న వారికి మద్యం, సిగిరెట్ లాంటివి సరఫరా చేస్తూ మిగతా డబ్బులు తమజేబులో వేసుకుంటారు.
గ్రామాలకు పాకిన బెట్టింగ్..
గతంలో హైదరాబాద్లాంటి పెద్ద నగరాల్లో ఉన్న బెట్టింగ్ దందా..చాపకింద నీరులా గ్రామాలు, తండాలకు పాకింది. గ్రామాల్లో రూ. వెయ్యి నుంచి రూ. 5వేలకు బెట్టింగ్ కాసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుమారు 100 మంది ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఈ దందా కొనసాగించనున్నారు. దీనికి బానిసలవుతున్న కొంతమంది ఏకంగా తమ బైకులు, గోల్డ్చైన్లు కుదవ పెట్టడంతో పాటు తెలిసిన స్నేహితుల దగ్గర రూ. లక్షలు అప్పు చేసి బెట్టింగ్లోపాల్గొంటున్నారు.
ఆన్లైన్ మోసం..
బెట్టింగ్ నిర్వహించేందుకు ఆన్లైన్ను ఉపయోగించుకుంటున్నారు కొంత మంది ప్రబుద్ధులు. 100 నుంచి 150 మంది వరకు ఒక గ్రూప్లో యాడ్ చేసి ఈ బెట్టింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రూ. 5వేలు కనీస ధర నిర్వహిస్తూ బెట్టింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆన్లైన్లోనే అకౌంట్లు క్రియేట్ చేసి ఫోన్ , గూగూల్ పే లాంటి యాప్ల ద్వారా అందులో డబ్బులు జమ చేయిస్తూ బెట్టింగ్ పాల్పడుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉంటేందుకు ఆన్లైన్ పం థాను కొనసాగించనున్నారు. బెట్టింగ్కు పాల్పడుతున్న యువతతోపాటు వ్యాపారులు, ఉద్యోగులు తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకున్నారు. బెట్టింగ్లో పాల్గొంటూ ఏకంగా రూ. 4 నుంచి 50 లక్షల వరకు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.
బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
బెట్టింగ్కు పాల్పడడం చట్టరీత్యానేరం.బెట్టింగ్ నిర్వహిస్తున్న వారితో పాటు అందులో పాల్గొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్పై అప్రమత్తంగా ఉండాలని బార్లు, హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులకు సూచించాం. అయినా బెట్టింగ్లకు పాల్పడితే నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యువత బెట్టింగ్లపై అప్రమత్తంగా ఉండాలి.
-ఎన్ శ్రీనివాస్, సీఐ, చౌటుప్పల్
బెట్టింగ్లకు ఆస్కారం
ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెట్టింగ్లకు ఆస్కారం ఉంటుంది. గతంలో బెట్టింగ్ల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుంటూ ఉన్న ఊర్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది. బెట్టింగ్ పాల్పడుతున్న వారు తమ పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు పోగొట్టుకుంటూ తమ పై ఆధారపడ్డ వారిని కూడా రోడ్డున పాడేయాల్సి వస్తుంది.
-కొయ్యడ శేఖర్, చౌటుప్పల్
నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి
గతంలో హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లో ఉండే బెట్టింగ్ చాపకింద నీరులా మండలాలు, అక్కడ నుంచి గ్రామాలు, తండాలకు పాకింది. యువత బెట్టింగ్ మోజులో పడి తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. బెట్టింగ్లో పోయేదే తప్పా వచ్చేదేమి ఉండదని తెలిసినా ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-కరంటోతు రవీందర్నాయక్, డాక్యాతండా, సంస్థాన్నారాయణపురం
ఇవి కూడా చదవండి
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
దీదీ.. ముస్లిం ఓట్లను కోల్పోయింది: ప్రధాని మోదీ