ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆరాధ్య దైవం
ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
త్రిపురారం, ఏప్రిల్ 4 : పక్కనే సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నా 50శాతం వాటా తీసుకొని రైతాంగానికి నీళ్లిచ్చే దమ్ము, సత్తా కాంగ్రెస్ నాయకులకు లేకపోయిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడడానికి, రైతును రాజుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని పల్లా తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని అనుముల సుశీలానర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రెండు కార్లకు నీరందుతున్నదని, ఆయకట్టులో వరి సాగు పెరిగిందని చెప్పారు. వరి, జొన్నలు, రాగులు, సజ్జలు… ఏ పంటనైనా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని చెప్తూ.. ఆయకట్టులో ఏ మూలకు నీరందకపోయినా మా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమేనని చెప్పారు.
టీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాలు : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
టీఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, టీఆర్ఎస్ను గెలిపించుకుంటే నిరంతరాయంగా కొనసాగుతాయని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు.. నిత్యం కొనసాగాలంటే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించాలని ఆయన కోరారు. త్రిపురారం మండలాన్ని దత్తత తీసుకొని మరీ అభివృద్ధి చేస్తానని చెప్పారు. సమావేశంలో ఉప ఎన్నికల మండల ఇన్చార్జి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బహునూతల నరేందర్, బైరెడ్డి కవిత పాల్గొన్నారు.
20కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక
త్రిపురారం మండలంలోని గడ్డమీద ప్రాంతం నుంచి 20కాంగ్రెస్, సీపీఎం కుటుంబాలు ఆదివారం నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరాయి. వారికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పార్టీ కండువాలు కప్పారు. ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయనే ఆలోచనతోనే టీఆర్ఎస్లో చేరుతున్నామని సీపీఎం నాయకులు వల్దాసు లచ్చయ్య తెలిపారు.