‘ఎదుటి మనిషి నిన్ను అంగీకరించాలంటే.. ముందు నిన్ను నువ్వు అంగీకరించాలి’ అంటున్నది నటి సోనాలీ బింద్రె. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నప్పుడు ఆమెలో జరిగిన అంతర్మథనం, వ్యాధి నుంచి బయటపడ్డాక ప్రజల్లోకి వెళ్లిన విధానం గురించి ‘వాట్ ఉమెన్ వాంట్’ అనే ప్రోగ్రామ్లో హోస్ట్గా వ్యవహరిస్తున్న నటి కరీనాకపూర్తో చెప్పుకొచ్చింది. అలాగే సెల్ఫ్ లవ్, సెల్ప్ మోటివేషన్ ప్రతిఒక్కరికీ అవసరమని గుర్తుచేసింది. ఆ షోలో సోనాలీ పంచుకున్న అభిప్రాయాలు ఆమె మాటల్లోనే..
క్యాన్సర్తో పోరాడుతున్నప్పుడు నాకు నా ప్రాధాన్యం గురించి తెలిసింది. నా తర్వాతే మరేదైనా అని బలంగా నిర్ణయించుకున్నా. ఎప్పటికప్పుడు నాకు నేను ధైర్యం చెప్పుకొన్నా. కోలుకున్న తర్వాత ‘నో’ చెప్పడం నేర్చుకున్నా. చాలా సందర్భాల్లో ‘నో’ చెప్పడానికి సంశయిస్తాం. కొన్నిసార్లు ‘లేదు, కాదు’ అని చెప్పడానికి మనసొప్పదు. కానీ, మనకు నచ్చని విషయాలకు నో చెప్పడం చాలా అవసరం. అలా చెప్పగలిగితే చాలా సంతోషంగా ఉండగలుగుతాం.
విమానంలోనే విగ్ తీసేశా: క్యాన్సర్ను జయించగలిగాను కానీ, దాని పర్యావసనాలను స్వీకరించడం అంత తేలిక అనిపించలేదు. ముఖ్యంగా జుట్టు కోల్పోవడం కష్టంగా అనిపించింది. మొదట్లో అస్సలు స్వీకరించలేకపోయా. విదేశాల్లో ట్రీట్మెంట్ అంతా పూర్తయ్యాక మనదేశానికి మొదటిసారి వస్తున్నప్పుడు తలకు విగ్ పెట్టుకొని బయల్దేరా. కానీ, ఇక్కడికి వచ్చాక మనసులోని భారమంతా ఎగిరిపోయింది. విమానం దిగడానికి ముందే విగ్ తీసేశాను. విమానాశ్రయంలో దిగేటప్పటికే మీడియా వాళ్లు ఎదురుగా ఉన్నారు. నన్ను చూడగానే ప్రశ్నల వర్షం కురుస్తుందనుకున్నా! కానీ, అందరూ మౌనంగా ఉండిపోయారు. నాపై అభిమానం చూపించారు. ప్రోత్సాహాన్ని అందించారు.
కావాల్సింది సానుభూతి కాదు: మనిషి బాధల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరు సానుభూతి వ్యక్తం చేస్తారు. కానీ, సానుభూతి మనిషికి ఊరటనివ్వదు. నాలుగు అడుగులు వెనక్కు లాగుతుంది. అందుకే ఇలాంటి సానుభూతిపరులను దూరంగా పెట్టాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి కావాల్సింది సానుభూతి (సింపతీ) కాదు సహానుభూతి (ఎంపతీ). ఇది మనిషికి ప్రేమను, ప్రోత్సాహాన్ని, ఆత్మస్థయిర్యాన్నిస్తుంది. అందుకే జాలి చూపేవారిని దూరంగా ఉంచి, నన్ను ప్రోత్సహించేవాళ్లకు దగ్గరగా ఉంటున్నా?