బ్రెయిలీ లిపితో చదివి.. బ్యాంక్ ఉద్యోగం సాధించి..
కుటుంబ సభ్యుల సహకారంతో ఉన్నతస్థానానికి..
రోజూ 12-15 గంటలు ల్యాప్టాప్ వినియోగించి..
ఆదర్శంగా నిలుస్తున్న దహెగాంకు చెందిన అనిల్
దహెగాం, ఏప్రిల్ 3 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన పందిర్ల బాపు-రాజేశ్వరి దంపతులు వారి కులవృత్తి అయిన నాయీ బ్రాహ్మణ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అనిల్, కిరణ్, హరీశ్ కుమారులు, శారద, సబిత కూతుర్లు. వీరిలో పెద్ద కుమారుడైన అనిల్ స్థానికంగా నాలుగో తరగతి చదువుతున్న క్రమంలో పాఠశాలలో ఆడుకుంటుండగా.. రాడు ఎడమ కంటికి తగిలింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించారు. తగ్గకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానలో కూడా చూపించారు. అప్పటికే రెండు కండ్లపై ఎఫెక్ట్ పడిందని, చూపురాదని వైద్యులు తెలిపారు. మానసికంగా కృంగి పోకుండా అనిల్ తాను బాగా చదువుకుంటానని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు సమ్మతించడం, ప్రధానంగా పెద్ద తమ్ముడు కిరణ్, చిన్న తమ్ముడు హరీశ్ ప్రోత్సాహంతో 2005-2011వరకు కరీంనగర్లోని అంధుల విద్యాలయంలో ఐదు నుంచి పదో తరగతి వరకు చదివాడు. అనంతరం 2011-2016 వరకు హైదరాబాద్లోని చిన జీయర్స్వామి నేత్ర విద్యాలయంలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. 2016-2018లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ(ఎంఏ ఇంగ్లిష్) పూర్తి చేశాడు.
బ్యాంక్ ఉద్యోగం సాధించి.. చదువు పూర్తయిన తర్వాత ఏదైనా ఉద్యోగం సాధించాలనే తపనతో ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. ప్రిపరేషన్ కొనసాగుతుండగానే బ్యాంక్ ఉద్యోగాల కోసం నోటిషికేషన్ వచ్చింది. ఆన్లైన్లో అప్లయ్ చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. పరీక్షరాసిన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగానికి అర్హత సాధించాడు. ఆరు రోజుల క్రితం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మంచిర్యాల బ్రాంచ్లో పీవోగా ఉద్యోగంలో చేరాడు.
ల్యాప్టాప్ సహాయంతో..
పదో తరగతి వరకు బ్రెయిలీ పలకపై విద్యాభ్యాసం చేశాడు. ఇంటర్ నుంచి ల్యాప్టాప్ ద్వారా హెడ్సెట్తో చదవడం, రాయడం చేశాడు. ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తుంటే బ్రెయిలీ భాషలో వాయిస్ వినుకుంటూ చదవడం, రాయడం చేశాడు. రోజు 12 నుంచి 15 గంటలు ల్యాప్టాప్ను ఉపయోగించాడు. చాలా కష్టపడి చదివాడు.
సాంకేతిక దన్ను
బ్రెయిలీ లిపిలో అచ్చయిన పుస్తకాలు పదో తరగతి వరకే అందుబాటులో ఉండేవి. అదీ కొద్ది మంది మాత్రమే వాటిని వినియోగించేవారు. ఆ తర్వాత ఆసక్తి ఉన్నా అవకాశం లేకపోవడంతో చాలా మంది అంధులు చదువును కొనసాగించలేక పోయేవారు. ఇప్పుడు, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు వరంగా మారాయి. టెక్నాలజీ సాయంతో చదువులోనే కాదు, నిత్య జీవితంలోనూ తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారు. ఆడియో పుస్తకాలు, ఎంపీత్రీ ప్లేయర్లు, ఆన్లైన్ పాఠాలు అంధులను ఉన్నత విద్య దిశగా నడిపిస్తున్నాయి. బ్రెయిలీ ప్రింటర్లు, స్కానర్లు కూడా వచ్చాయి. స్క్రీన్ మాగ్రిఫికేషన్ సాఫ్ట్వేర్( ఏ వస్తువును స్కాన్ చేసినా ఆడియో రూపంలో మారుతుంది) ఉపయోగించి అక్షరాలను, ఇతర వస్తువులను మనోనేత్రంతో దర్శించగలుగుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ), సెన్సార్ల సాయంతో ఎవరి తోడు లేకుండానే, ప్రయాణించగలుగుతున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో కూడా రాణిస్తున్నారు.
వెలుగు చుక్కలు
అంధులకు అక్షరజ్ఞానాన్ని ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. జనవరి 4, 1809 సంవత్సరంలో ప్యారిస్లో జన్మించాడు. నాలుగేండ్లున్నప్పుడు ప్రమాదవశాత్తు కంటిచూపు కోల్పోయాడు. చదువుకోవడానికి చాలా అగచాట్లు పడ్డాడు. అంధులెవరూ తనలా ఇబ్బంది పడకూడదని ప్రత్యేకమైన లిపిని సృష్టించాడు. తేలికగా చదువుకొని, రాయగలిగే లిపిని అందుబాటులోకి తెచ్చాడు. అప్పటివరకు ఉన్న 12 చుక్కల సాంకేతిక లిపి స్థానంలో ఆరు చుక్కల సాంకేతిక లిపి ఆవిష్కరించాడు. అక్షరాలు, పదాలు, సంగీత చిహ్నాలు రూపొందించి అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరింపజేశాడు. దశాబ్దాలు మారినా, సాంకేతికత పెరిగినా నేటికీ అంధుల విద్యావిధానంలో బ్రెయిలీ లిపి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. యేటా జనవరి 4న బ్రెయిలీ డేను నిర్వహిస్తుంటాం.
ఇవి కూడా చూడండి..
మహారాష్ట్రలో 24 గంటల్లో 50వేల కేసులు..277 మరణాలు
ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్