ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య పన్నులశాఖ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ, వ్యాట్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.52 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.47వేల కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.4 వేల కోట్లు పెరిగి 9.93% వృద్ధిని నమోదు చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మార్చి నెలాఖరు నాటికి జీఎస్టీ, వ్యాట్ రాబడిలో అధిక వృద్ధి రేటు సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ కూడా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా సారథ్యం వహిస్తున్న వాణిజ్య పన్నులశాఖ అత్యంత గడ్డు పరిస్థితులలోనూ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. తెలంగాణ ఆవిర్భవించిన మొదటి సంవత్సరం రూ.27వేల కోట్లుగా ఉన్న వాణిజ్య పన్నుల రాబడి ప్రస్తుతం రూ.52,388.98 కోట్లకు పెరిగింది. ఆరున్నరేండ్లలోనే దాదాపు రెండురెట్ల వృద్ధిని నమోదుచేసింది. కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో మొదటి ఆరు నెలలు పన్ను వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. నెలకు రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే పరిమితమైన రాబడి ఆ తర్వాత వేగంగా పుంజుకున్నది. లాక్డౌన్ నిబంధనలు సడలించి, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోగానే పన్నుల రాబడి కూడా జోరందుకుంది. సెప్టెంబర్ నెల నుంచి జీఎస్టీ, వ్యాట్ వసూళ్లు భారీగా పెరిగాయి. నవంబర్ నెలలో రూ.6,876కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఒక్క నెలలో ఆల్టైమ్ రికార్డుగా 77% వృద్ధిరేటును సాధించింది. డిసెంబర్లో రూ.5,812 కోట్లు, జనవరిలో రూ.5,223 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,095 కోట్లు, మార్చి నెలలో రూ.6,536.03 కోట్ల రాబడి వచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నష్టపరిహారం ద్వారా రూ.5,483 కోట్లు వచ్చాయి. మార్చిలో 30.28% వృద్ధిరేటు నమోదైంది.
కేంద్రం సెస్, సర్చార్జీలతో గండి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఇబ్బడి ముబ్బడిగా సెస్, సర్చార్జీలను పెంచడం వల్ల రాష్ర్టానికి వ్యాట్ రాబడి తగ్గింది. దాదాపు 14 శాతం అంటే.. రూ.1600 కోట్ల వరకు గండిపడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పర్యవేక్షణలో గత రెండు నెలలుగా వాణిజ్యపన్నుల శాఖ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాన్నిచ్చింది.