హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోళ్లు, పాడి పశువులు, గొర్రె ల పెంపకంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే కోళ్ల ఫామ్లు, డెయిరీ ఫామ్ల సంస్కృతి విస్తృతం కాగా తాజాగా గొర్రెల పెంపకం కూడా అదే దారిలోకి వెళ్తున్నది. గొర్రెలను చెలకల్లో తిప్పి పెంచేవారు తగ్గిపోతున్నారు. గొర్రెలకు ప్రత్యేకంగా ఫామ్లు (షీప్ ఫామింగ్) నిర్మించి పెంచే సంస్కృతి పెరుగుతున్నది. తెలంగాణ పశు సంవర్ధకశాఖ కూడా ఇదే ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే గొల్ల కురుమలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తుండగా, దీనికి అదనంగా మండలానికి ఒకటిరెండు చొప్పున షీప్ ఫామ్లను ఏర్పాటుచేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. గ్రామాల్లో నిరుద్యోగ గొల్ల కురుమ యువకులను ఎంపికచేసి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందితో ఒక యూనిట్ ఏర్పాటుచేసి సబ్సిడీపై గొర్రెలను అందించాలని యోచిస్తున్నారు. ఒక్కో ఫామ్కు 100-150 గొర్రెలను పంపిణీ చేయాలనేది ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను త్వరలోనే ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు.
ఎన్నో ఉపయోగాలు
షీప్ ఫామింగ్ను ప్రోత్సహించడంవల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వినియోగదారులకు నాణ్యమైన మాంసం తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతితో పోల్చితే షీప్ ఫామింగ్ విధానంలో గొర్రెల నుంచి ఎక్కువ మాంసం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గొర్రెల పెంపకందారులు తక్కువ బరువు ఉండగానే గొర్రెలను విక్రయిస్తున్నారు. ఫామింగ్ విధానంలో అయితే ఎక్కువ బరువు వచ్చేవరకు పెంచవచ్చని అధికారులు అంటున్నారు.