టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఉచిత భోజనం
తెలంగాణభవన్ ప్రాంగణంలో ఆధునిక క్యాంటీన్
నలుమూలల నుంచి వస్తున్నవారి ఆకలి తీరుస్తున్న పార్టీ
అన్నం.. రుచికరమైన ఓ కూర, పప్పు, సాంబారు, రెండు రకాల తొక్కులు, పచ్చిపులుసు. వేపుడు (ఫ్రై). పాపడాలు. పెరుగు. పిండివంటలు. ఇది వివిధ పనులపై తెలంగాణభవన్కు వచ్చే టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఉచితంగా అందిస్తున్న ఆత్మీయ భోజనం.. ‘ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లు లేదా చెక్కులు తీసుకొని వెళ్లే పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులు ఎవరైనా సరే.. వారితో ఎంతమంది వచ్చినా సరే వారికి ఉచితంగా అన్నంపెట్టి ఇంటికి పంపాలి. ఖాళీ కడుపులతో తిరిగి పోవొద్దు’ అన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణభవన్ ప్రాంగణంలో ఏర్పాటైన క్యాంటీన్ (టీ కేఫ్) అన్నార్థులకు రుచికరమైన భోజనం అందిస్తున్నది. కడుపులు నింపి.. ‘సల్లంగ ఉండు బిడ్డా’ అన్న దీవెనలు అందుకుంటున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): “పొద్దుగాల మా ఊరి నుంచి కొడుకును ఎత్తుకొని వచ్చిన. తొవ్వల ఏం తినలే. వచ్చిన పనిముంగట ఆకలి తెల్వలేదు. ఇక్కడికి రాంగనే ‘ముందు భోజనం చేసి రండి’ అని మనిషిని ఇచ్చి పంపిండ్లు. కొడుక్కు తినిపిచ్చి నేనూ సల్లబడ్డ. పానం నిమ్మలమైంది” అని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం ముందు కూర్చొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెం దిన గుండెల్లి చంద్రకళ సంతోషం ఇది.. వ్యవసాయ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త నర్సింహులు భార్య ఈమె. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు నవీన్ మూడో తరగతి చదువుతున్నాడు. చిన్నకొడుకు అన్విత్కు మూడేండ్లు. టీఆర్ఎస్ కార్యకర్త అయిన నర్సింహులుకు పార్టీ సభ్యత్వం ఉన్నది. ప్ర మాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా కింద రూ.2 లక్షల చెక్కును తీసుకోవటానికి ఆమె గురువారం తెలంగాణభవన్కు వచ్చింది. ఆమెతోపాటు 30 మం దికి ప్రమాదబీమా చెక్కులను అందజేశారు.
ఇలా రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ పనులపై రోజూ పదులసంఖ్యలో వస్తున్న కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్లోని క్యాంటీన్ (టీ కేఫ్) కడుపు నిండా భోజనం పెడుతున్నది. ‘అన్నం తిన్నారా.. భోజనం చేశాక పని చూసుకోండి’ అని ఆత్మీయంగా పలుకరిస్తున్నది. టీ-కేఫ్లో కేవలం భోజనమే కాదు ఉదయం టిఫిన్స్, సాయంత్రం అల్పాహారం (స్నాక్స్), ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇరానీ చాయ్ అందుబాటులో ఉంటుంది. ‘భవన్కొచ్చేవారు ఆకలితో ఇంటికి వెళ్లొద్దు అని సీఎం సార్ చెప్పారు. పార్టీ ఫండ్ నుంచి నెలనెలా భోజనాలకు అయిన మొత్తాన్ని ఎ మ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి మాకు ఇస్తారు’ అని టీ-కేఫ్ నిర్వాహకులు తెలిపారు. కార్యకర్తలకే కా కుండా అందరికీ అందుబాటు ధరలో భోజ నం, టిఫిన్స్ అందిస్తున్నామని చెప్పారు.