త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్
సీఎం కేసీఆర్ ఆదేశంతో ఖాళీల వివరాలు సేకరణ
ముందస్తు సన్నద్ధతలో యువత
ఉచితంగా స్టడీ సెంటర్లు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు
హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు
నాగర్కర్నూల్, ఏప్రిల్ 1, (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఆయా శాఖల్లో ఖాళీల భర్తీపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలను నివేదించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలో భాగంగా త్వరలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఈమేరకు ముందస్తుగా ఆయా నియోజకవర్గాల్లో సొంత ఖర్చులతో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలు నిరుద్యోగులకు వరంలా మారాయి. ఉద్యోగ సాధనే లక్ష్యంగా యువత ముందుకుసాగుతున్నది.
తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానున్నది. సీఎం కేసీఆర్ హామీ మేరకు త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనతో ఆయా శాఖల్లో ఖాళీల భర్తీపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించారు. స్వరాష్ట్ర ఆకాంక్ష సాధనలో భాగమైన నీళ్లు, నిధుల్లో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో నిలుస్తున్నది. ఈ క్రమంలో గత ఐదేండ్లలో పోలీసు, వైద్య, విద్య, పంచాయతీ, వ్యవసాయ, రెవెన్యూ వంటి పలు శాఖల్లో వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇటీవలే పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రమోషన్లను ఒక్క నెలలోనే చేపట్టడం గమనార్హం. కాగా, ప్రధానమైన ఉద్యోగ ఖాళీల భర్తీకి జంబో స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ఇప్పటికే శాఖల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా, ప్రమోషన్ల తర్వాత మిగిలిన ఖాళీలను బట్టి త్వరలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. దీంతో నిరుద్యోగ యువతలో ఆనందం వ్యక్తమవుతున్నది. కొందరు హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కోచింగ్ తీసుకునేందుకు వెళ్లారు. ఇదిలా ఉంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సైతం నిరుద్యోగ యువత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేలా ముందుకు రావడం విశేషం. సొంత ఖర్చులతో నియోజకవర్గ కేంద్రాల్లో స్టడీ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఇక్కడ అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కూడా ఉచితంగానే కల్పిస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లలేని పేద, మధ్యతరగతి యువతకు ఈ స్టడీ సెంటర్లు వరంలా మారాయి.
కరోనా నేపథ్యంలో భౌతికదూరం, ఇతర నిబంధనలను పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపడుతున్నారు. శిక్షణ పూర్తయ్యాక స్టడీ మెటీరియల్ సైతం ఉచితంగా అందించనున్నారు. హైదరాబాద్లో నిపుణులైన వ్యక్తులచే తరగతుల బోధన చేపట్టనున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో పని చేసే యువత కూడా ఉద్యోగ సన్నద్ధతలో నిమగ్నమవుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు టీఆర్ఎస్ను గెలిపించి సీఎంపై తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో త్వరలో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం సానుకూల ప్రకటన చేయడం గమనార్హం. మొత్తమ్మీద త్వరలో వెలువడబోయే ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రకటన నిరుద్యోగ యువతీయువకుల్లో సంతోషాన్ని నింపింది. ఫలితంగా స్టడీ సెంటర్లు, ఇండ్లల్లో చదువుల్లో మునిగిపోయారు.
ప్రిపేర్ అవుతున్నా..
పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను. సీఎం కేసీఆర్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించడం హర్షణీయం. కొలువును సాధించేందుకు ముందస్తుగా సిద్ధమవుతున్నాను. ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం కచ్చితంగా ఉంది.