న్యూఢిల్లీ: అతివలకు ఎంతో ఇష్టమైంది.. పెట్టుబడి దారులకు ప్రియమైంది బంగారం.. ఆర్థిక రంగంలో అనిశ్చితి నెలకొన్నప్పుడల్లా బంగారం ధర ధగధగమంటూ పెరుగుతూ పైపైకి దూసుకెళుతుంటుంది… పెండ్లిండ్లు.. ఇతర వేడుకల వేళ కూడా బంగారం అందనంటూ పైపైకి వెళుతుంది.. గతేడాది ఆగస్టులో తులం బంగారం ధర రూ.56 వేలకు పెరిగి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది.. తాజాగా 20 శాతం పసిడి ధర తగ్గిపోయింది. ఇక ముందూ నేల చూపులు చూస్తూనే ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మున్ముందు రూ.40 వేల దిగువకు పడిపోతుందని అంచనా. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు మరికొంత ధర దిగి వచ్చే వరకూ వేచి చూడాలని బులియన్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వ బాండ్లు పుంజుకోగా, డాలర్ విలువ బలోపేతం అవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర ఒత్తిడికి గురవుతున్నది. ప్రస్తుతం స్పాట్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.44,500 దిగువన ట్రేడ్ అవుతున్నది. ఇక ముందు రూ.40 వేల దిగువకు పడిపోయినా ఆశ్చర్యం లేదని ఓ విశ్లేషకుడు చెప్పారు.
ఎస్ఎంఎస్ గ్లోబల్ వద్ద ఏవీపీ ఫర్ కమొడిటీ రీసెర్చ్ ప్రతినిధి వందనా భారతి మాట్లాడుతూ.. అమెరికా బాండ్ల విలువ ట్రేడింగ్లో బలోపేతం అవుతుండగా, డాలర్ ఇండెక్స్ పెరిగే అవకాశం ఉందన్నారు. బంగారం ధర మరింత కిందకు దిగి రానున్నదని, తులం బంగారం రూ.42 వేలకు దిగి వచ్చిన తర్వాత కొనుక్కుంటే మంచిదన్నారు.
మున్ముందు తులం బంగారం ధర రూ.40 వేలకు పడిపోవచ్చునని వందనాభారతి చెప్పారు. ఇది అతి తక్కువ కాలంలో జరుగుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోవచ్చునన్నారు. 2019 అక్టోబర్లో చివరిగా తులం బంగారం రూ.40 వేల స్థాయి వద్ద ట్రేడయింది.
2019 అక్టోబర్లో రూ.40 వేలుగా ఉన్న తులం బంగారం ధర.. తర్వాతీ కాలంలో పైపైకి దూసుకెళ్లింది. అయితే, 2019లో వాణిజ్య యుద్ధం.. తర్వాత కరోనా ప్రభావంతో బంగారం ధర ఆల్ టైం రికార్డులు నమోదు చేసింది.
అదే సమయంలో కరోనా కాలంలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్.. ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఏప్రిల్లో భారత్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే!