రెండు మండల పరిషత్లు, నాలుగు జీపీలకు పురస్కారాలు
పెద్దపల్లి జిల్లా సుందిళ్లకు రెండు అవార్డులు
కరీంనగర్ మార్చి 31 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ‘దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్’ అవార్డుల్లో రెండు మండల పరిషత్లు, నాలుగు గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. ఇందులో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండల పరిషత్లతో పాటు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్, ముస్తాబాద్ మండలం మోహినికుంట ఉండగా, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల రెండు అవార్డులు సాధించి సత్తా చాటింది.
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్ అవార్డుల్లో ఉమ్మడి జిల్లా మరోసారి మెరిసింది. జాతీయ స్థాయిలో పోటీ పడి రెండు మండల పరిషత్లు, నాలుగు గ్రామ పంచాయతీలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి రెండు అవార్డులు దక్కడం విశేషం. కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ బుధవారం ఈ అవార్డులను ప్రకటించింది. జనరల్ కేటగిరీ కింద రాష్ట్రంలో ఎంపికైన రెండు మండల ప్రజా పరిషత్లు కూడా ఉమ్మడి జిల్లాకు చెందినవి కావడం మరో విశేషం. ఈ అవార్డులను జగిత్యాల జిల్లా కోరుట్ల, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ప్రజా పరిషత్లు దక్కించుకున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో బడుగు బలహీన వర్గాలను మమేకం చేసి అభివృద్ధిలో భాగస్వాములను చేసిన కేటగిరీలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి అవార్డు వచ్చింది. ప్రకృతి వనరుల సంరక్షణలో చొరవ చూపిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ గ్రామానికి అవార్డు వచ్చింది. బాలల హక్కుల సంరక్షణకు కృషి చేసిన ఇదే జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు దక్కింది. ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల పంచాయతీకి రెండు అవార్డులు వచ్చాయి. గ్రామ సభల సక్రమ నిర్వహణ, గ్రామ పంచాయతీ ప్రణాళికల అమలుపై అవార్డులు దక్కాయి.
మంత్రి కేటీఆర్ సహకారంతోనే..
ఎల్లారెడ్డిపేట, మార్చి 31: మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్వచ్ఛభారత్ కోసం చేసిన ప్రయత్నానికి హరిదాస్నగర్కు తగిన గుర్తింపు లభించిందని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు తెలిపారు. సహజవనరుల నిర్వహణ, హరితహారం విజయవంతంతో ఈ అవార్డు లభించిందని తెలిపారు.