రా మెటీరియల్ తయారీలో రాణిస్తున్న స్వాతి
చిరు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభం
పేపర్ ప్లేట్స్కు మెటీరియల్ సరఫరా
ఏడాదికి కోట్లాది రూపాయల బిజినెస్
ఐదుగురికి జీవనోపాధి
ఆమె సాధారణ గృహిణుల్లా వంటింటికే పరిమితం కాలేదు. పట్టుదలే పెట్టుబడిగా, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుసాగింది. ఎంతటి దూర ప్రయాణమైన ఒక్కడుగుతోనే మొదలవుతుందన్నట్లు తొలుత చిరు వ్యాపారాన్ని ప్రారంభించింది. అంతటితో సంతృప్తి చెందకుండా అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఏకంగా ఏడాదికి 2కోట్ల దాకా టర్నోవర్ సాధించింది. తన కాళ్లపై తాను నిలబడుతూనే మరో నలుగురికి ‘దారి’ చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్న జమ్మికుంటకు చెందిన నవునూరి స్వాతిపై ‘నమస్తే’ కథనం.. – హుజూరాబాద్, మార్చి 31
జమ్మికుంటకు చెందిన నవునూరి స్వాతిది దిగువ మధ్య తరగతి కుటుంబం. భర్త రమేశ్ చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. అతడి వేతనంతోనే ఇల్లు గడిచేది. కానీ, భవిష్యత్ అవసరాల కోసం కనీసం పొదుపుచేసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్న స్వాతి దృష్టి వ్యాపారంవైపు మళ్లింది. అనుకున్నదే తడవుగా పేపర్ప్లేట్ల తయారీ వైపు అడుగులేసింది. 2014లో మహిళా సంఘం నుంచి 50వేల అప్పు తీసుకుని ఓ మిషిన్ను కొనుగోలు చేసింది. అలా రెండేళ్లపాటు ఈ చిరువ్యాపారంలో నిమగ్నమైంది. ఖర్చులు అన్నీ పోను నెలకు 8వేల వరకు మిగిలేది. పేపర్ప్లేట్ల తయారీకి రా మెటీరియల్లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నది. డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో మెటీరియల్ అందక వ్యాపారం కుంటుపడేది. తనలాగే ఎందరో ఇక్కట్లు పడుతున్నారని తెలుసుకున్నది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు తానే మెటీరియల్ తెచ్చి ఇస్తే బాగుంటుందని భావించింది. కొంతకాలం హైదరాబాద్లో కొనుగోలు చేసి పేపర్ ప్లేట్ల తయారీదారులకు విక్రయించేంది. ఇంతటితో కూడా ఆమె సంతృప్తి చెందలేదు. మరో అడుగు ముందుకు వేసింది. తానే మెటీరియల్ తయారు చేయాలని సంకల్పించింది.
అన్నీ పోనూ 50వేలు మిగులు
నెలలో దాదాపుగా 4వేల కట్టలు తయారు చేస్తుండగా, ఒక్కో కట్టను 336 చొప్పున విక్రయిస్తున్నారు. వీటికి మొత్తం 13లక్షల 44వేలు వస్తాయి. ఇందులో నెలకు కరెంట్ బిల్లు, వర్కర్లకు కలిపి 34వేలు, కార్ఖానా అద్దె 4వేలు, రా మెటీరియల్కు 12 లక్షల 90వేలు, ఇతరత్రా ఖర్చులు పోను నెలకు 50 వేల వరకు మిగులుతున్నాయని స్వాతి పేర్కొంటున్నది. మొత్తానికి సంవత్సరానికి చూసుకుంటే కోటీ 61లక్షల 28వేల టర్నోవర్ ఉంటుంది.
18లక్షల 50 వేలతో పెట్టుబడి..
రా మెటీరియల్ తయారీకి పెట్టుబడి పెద్ద ఎత్తున ఉంటుందని తెలుసుకున్నది. తన దగ్గర కేవలం 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. అట్టి మిషిన్లకు 18 లక్షల 50వేలు పెట్టుబడి అవసరమైంది. తెలిసిన వాళ్ల వద్ద అప్పు తీసుకొని 2016లో రామెటీరియల్ వ్యాపారాన్ని ప్రారంభించింది. రా మెటీరియల్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండగా, ముందుగానే ఆర్డర్లు తీసుకొని విక్రయిస్తున్నది. పరకాల, హుజూరాబాద్, వీణవంక, పెద్దపెల్లి, ఇల్లంతకుంట, శంకరపట్నం తదితర పట్టణాల నుంచి వస్తుండగా, రెండు రోజులకు ఇద్దరికి మాత్రమే సరఫరా చేస్తున్నది. రెండు రోజులకు 300కట్టలు (ఒక కట్టలో 210 ప్లేట్లకు సరిపోయే మెటీరియల్) తయారు చేయగా, ఇద్దరికి ఆర్డర్పై ఇస్తున్నది.
వ్యాపారం పెంచాలని ఉన్నది..
పేపర్ ప్లేట్ రామెటీరియల్కు డిమాండ్ మస్తుగా ఉన్నది. ప్లేట్స్ తయారు చేసేవాళ్లు ఎందరో మెటీరియల్ సరఫరా చేయాలని అడుగుతున్నారు. అప్పుడు పెట్టిన మిషన్ల అప్పు ఇంకా 8లక్షల వరకు ఉంది. త్వరలోనే తీరుస్తాను. పెద్దగా ఇబ్బంది లేదు. డిమాండ్ బాగా ఉండడంతో వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా. ప్రభుత్వం 10లక్షల వరకు బ్యాంకు లోన్ ఇప్పిస్తే బాగుంటుంది.
ఐదుగురికి ఉపాధి..
జమ్మికుంట పట్టణంలో స్వాతి తయారు చేస్తున్న రా మెటీరియల్ ఓ చిన్నపాటి పరిశ్రమను తలపిస్తుంది. మొత్తం ఐదు మిషిన్లు ఉండగా, అందులో ఐదుగురు పని చేస్తున్నారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఉదయం 9.30నుంచి సాయంత్రం 5గంటల వరకు పని ఉంటుంది. ఒక్కొక్కరికీ కొంచెం అటు ఇటుగా 6వేల వరకు జీతం ఇస్తున్నది. అందులో పని చేసే కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.