హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తమకు అదనంగా రూ.2843 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరాయి. వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం చేసిన కేటాయింపులు కాకుండా తమ రాబడి, ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం ఉందని పేర్కొన్నాయి. ఈ భారాన్ని వినియోగదారులపై వేయడం లేదని, ప్రభుత్వమే తమకు అదనపు సహకారాన్ని అందించాలని కోరాయి. ఈ మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తెలంగాణలోని రెండు డిస్కంలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ను సమర్పించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు పలు వర్గాలకు రాయితీలనిస్తున్నది. ఈ మొత్తానికి గాను బడ్జెట్లో రూ.10,500 కోట్లు కేటాయించింది. అయితే విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయం, ఖర్చుల మధ్య రూ.2843 కోట్లు తేడా వచ్చింది. ఈ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ వినియోగదారులపై పైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తమకు అదనపు సహాయాన్ని అందించాలని కోరుతున్నాయి.
వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ను కొనసాగించనున్నట్టు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం వెల్లడించింది. అందుకు అనుగుణంగానే విద్యుత్తు పంపిణీ సంస్థలు కూడా తమ ఏఆర్ఆర్ను రూపొందించాయి. వ్యవసాయంతోపాటు అన్ని వర్గాల వినియోగదారులకు 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా.. తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం తమకు అదనపు ఆర్థిక సహాయం చేసేలా ఏఆర్ఆర్ రూపొందించింది.