మొదటి మేజర్కు నీళ్లు ఇవ్వలేని చరిత్ర జానాది
చివరి భూములకూ నీరందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
2014 తర్వాతే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఏమిటో తెలిసింది
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
హాలియా, త్రిపురారం, మాడ్గులపల్లి, మండలాల్లో ఎన్నికల ప్రచారం
త్రిపురారం/మాడ్గులపల్లి, మార్చి 31 : ఏడేండ్లుగా అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఓట్లు అడిగే హక్కు తమకే ఉన్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి త్రిపురారం, మాడ్గులపల్లి మండలాల్లో భగత్పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏడు మంచి పనులుకూడా చేయలేదన్నారు. సాగర్ ఎడమకాల్వలో మొదటి మేజర్ రాజవరానికి కనీసం నీళ్లు కూడా అందించలేదని విమర్శించారు. 2014 తర్వాతే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఏమిటో తెలిసిందని, అందుకే 2018 ఎన్నికల్లో దివంగత నేత నోముల నర్సింహయ్యను గెలిపించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్దేనని, భగత్ను గెలిపిస్తేనే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించాలని బుధవారం త్రిపురారం, మాడ్గులపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండలం కంపాసాగర్, కంపాలపల్లి, కొణతాలపల్లి, కామారెడ్డిగూడెం, జి.అన్నారం, మాడ్గులపల్లి మండలం మాచనపల్లి, నారాయణపురం, కేశవాపురం గ్రామాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, వరంగల్ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
గడప గడపకూ సంక్షేమ పథకాలందుతున్నాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో జానా ఏం అభివృద్ధి చేశాడని ఓట్లు అడగడానికి వస్తున్నాడని, గ్రామాల్లోకొస్తే ప్రజలు నిలదీస్తారనే భయంతో ‘ఎవరూ ప్రచారం చేయొద్దు.. హైదరాబాద్లో కూర్చుందాం’ అనే చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే అక్కడుండి ప్రచారం చేద్దామని అంటున్నారన్నారు. నాగార్జునసాగర్ ప్రజలు జానారెడ్డిని భుజాల మీద ఎత్తుకొని ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఏడు మంచి పనులు కూడా చేయలేదని విమర్శించారు. ఎడమకాల్వలో మొదటిదైన రాజవరం మేజర్కు నీళ్లు అందించలేని జానారెడ్డి అభివృద్ధి ఎలా చేయిస్తారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే రాజవరం మేజర్కు ఆగకుండా నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. జానారెడ్డి హయాంలో కాల్వ చివరి భూములు బీడులుగా మార్చారని, 2017నుంచి చివరి భూములన్నింటికీ నీరందిస్తున్నామని, ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. వరద కాల్వ పనులు పూర్తిచేసి 84వేల ఎకరాలకు, 34చెరువులకు జీవం పోసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో లింకురోడ్లు అధ్వానంగా మారాయని, వాగులపై వంతెనల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. 40ఏండ్లు కూడా నిండని యువకుడితో 40సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి పోటీ పడుతున్నాడని అన్నారు. సాగర్లో నోముల భగత్ విజయం ఖాయమైందని, అందుకే జానా ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. రెండు పంటలకు నీళ్లిస్తూ రైతుల యోగ క్షేమాలు చూస్తున్న టీఆర్ఎస్కు ఓటేసి భగత్ను గెలిపిస్తే నాగార్జునసాగర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని, తనకు మించిన పనులేమైనా ఉంటే జిల్లా మంత్రిగా దగ్గరుండి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ విజయం ఖాయం : ఎంపీ బడుగుల
సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంతా కాంగ్రెస్ మోసాలకు గురైన వారేనని, పండుగలు, పబ్బాలకు వచ్చి తలకాయ కూరలు తినిపోయే వారు కాదు.. టీఆర్ఎస్ నాయకులు అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నర్సింహయ్య గారు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. ఈ నెల17న జరిగే పోలింగ్లో కారుగుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. త్రిపురారం మండలంలో జరిగిన ప్రచారంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నాయకులు పాల్గొన్నారు. మాడ్గులపల్లి మండలంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి : ఎమ్మెల్సీ పల్లా
టీఆర్ఎస్ పార్టీ విజయంతోనే అభివృద్ధి సాధ్యమని మండలి విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాచనపల్లిలో ఆయన మాట్లాడుతూ నోముల నర్సింహయ్య అకాల మరణం తీరని లోటు అని అన్నారు. నియోజకవర్గంలో రెండేండ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికల్లో పోటీచేస్తున్న నోముల భగత్ను ప్రజలంతా ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే వరద కాల్వ వచ్చిందని, కాల్వల ద్వారా నీళ్లు రావడంతో ఏడు మండలాల్లో వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలమయ్యాయని తెలిపారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చుడండి
విటమిన్ డి మనకు ఎందుకు అవసరమంటే..?
కిడ్నీ స్టోన్లు ఉన్నాయని తెలిపే లక్షణాలు ఇవే..!