న్యూఢిల్లీ, మార్చి 31: పోస్టల్ పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పొదుపు పథకాల వడ్డీ రేట్లను మరోసారి భారీ స్థాయిలో కుదించింది. గత మూడు త్రైమాసికాల నుంచి మార్పు లేకుండా కొనసాగుతున్న ఈ వడ్డీ రేట్లను 40 నుంచి 110 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1 శాతానికి సమానం) మేరకు తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికానికి వర్తించే ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయని తాజా సర్క్యులర్లో కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీ రేటు 7.1% నుంచి 6.4 శాతానికి తగ్గింది. గత 46 ఏండ్లలో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి. ఈ రేటు 7% కంటే తక్కువకు దిగజారడం 1974 తర్వాత ఇదే తొలిసారి. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వడ్డీ రేటు 6.8% నుంచి 5.9 శాతానికి, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వడ్డీ రేటు 7.6% నుంచి 6.9 శాతానికి తగ్గింది. మరోవైపు వివిధ కాలపరిమితులతో కూడిన పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు 0.40-1.1 శాతం మేరకు తగ్గాయి. దీంతో ఈ డిపాజిట్లకు లభించే వడ్డీ 4.4-5.3 శాతానికి పరిమితం కానున్నది.
చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లను కుదించడం ఏడాది కాలంలో ఇది రెండోసారి. 2020-21 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను 70 నుంచి 140 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిన విషయం విదితమే. తాజా కుదింపుతో చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 110 నుంచి 250 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గినట్లయింది.
పోస్టల్ శాఖ ఆధ్వర్యంలోని ఏ పథకం నుంచైనా డిపాజిటర్లు రూ.20 లక్షలకు మించి నగదును విత్డ్రా చేస్తే టీడీఎస్ రూపంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలను పోస్టల్ శాఖ జారీ చేసింది. పీపీఎఫ్ విత్డ్రాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఆదాయ పన్ను చట్టం-1961లోని 194ఎన్ సెక్షన్కు చేసిన సవరణల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. డిపాజిటర్లు గత మూడేండ్లుగా ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)లు దాఖలు చేయకపోతే వారు విత్డ్రా చేసే మొత్తం నుంచి టీడీఎస్ను వసూలు చేస్తామని పేర్కొన్నది. ఫైనాన్స్ యాక్ట్-2020 ప్రకారం గతేడాది జులై 1 నుంచే ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. పన్ను చెల్లించని డిపాజిటర్లు ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు నగదు విత్డ్రా చేస్తే.. వారి నుంచి 2 శాతం, రూ.కోటి కంటే ఎక్కువ విత్డ్రా చేసేవారి నుంచి 5 శాతం చొప్పున టీడీఎస్ వసూలు చేస్తామని వివరించింది. ఆదాయ పన్ను చెల్లించేవారు రూ.కోటి రూపాయలకు మించి నగదు ఉపసంహరిస్తే వారికి 2 శాతం టీడీఎస్ విధిస్తామని పోస్టల్ శాఖ పేర్కొన్నది.
ఇవీ కూడా చదవండి
ఆ క్షణం కళ్లల్లో నీళ్లు తిరిగాయి
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా