జకార్తా : ఇండోనేషియాలోని మకాస్సర్లోని చర్చి వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 14 మంది గాయపడ్డారు. ఇండోనేషియాలోని మకాస్సర్లో ఆదివారం ఉదయం చర్చి వెలుపల పేలుడు సంభవించింది. ఈ పేలుడులో చాలా మంది గాయపడ్డారు. ఆదివారం రోజు ప్రార్థనల కోసం చర్చికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
చర్చి పాస్టర్ ఈ సంఘటనను ఆత్మాహుతి దాడిగా అభివర్ణించినట్లు స్థానిక మీడియా కథనాలు వచ్చాయి. అయితే, పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
పేలుడు తర్వాత సమీపంలోని భవనాల బయట నిలిపిన కార్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మీడియా నివేదికలు తెలిపాయి.
పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరంలోని ప్రధాన క్యాథలిక్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనల తరువాత ఈ పేలుడు సంభవించింది. ప్రార్థనలు పూర్తి చేసుకుని ప్రజలు ఇంటికి బయలుదేరే సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించినట్లు చర్చి పాస్టర్ చెప్పారు. ప్రార్థన చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ఆత్మాహుతి బాంబర్ లోపలికి రాకుండా నిలుపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక పోలీసులు తెలిపారు.
ఇండోనేషియాలోని చర్చిలను ఉగ్రవాదులు తమ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. 2018 లో దేశంలో జరిగిన ఇలాంటి బాంబు దాడిలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఇండోనేషియాలోని రెండవ అతిపెద్ద నగరమైన సురబయలోని ఒక చర్చిలో ఆదివారం ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మాహుతి దళానికి చెందిన ఒక కుటుంబం చర్చిలోకి ప్రవేశించి తమను తాము పేల్చుకున్నది.
సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ
అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..